హిందీ టీవీ స్టార్కు కొవిడ్ 19 పాజిటివ్!
on Jul 13, 2020
హిందీ టీవీ క్వీన్ ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న 'కసౌటీ జిందగీ కే 2' సీరియల్లో అనురాగ్ బసుగా లీడ్ రోల్ చేస్తున్న పార్థ్ సంతాన్ ఆదివారం కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసిన అతను, గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా మెలగిన వాళ్లందరినీ కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరాడు. డాక్టర్ల సూచన మేరకు సెల్ఫ్-క్వారంటైన్లో ఉన్నట్లు అతను తెలిపాడు. దీంతో ఆ సీరియల్ షూటింగ్ను మూడు రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ఏక్తా కపూర్ నిర్మాణ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకంటూ షూటింగ్ నిర్వహిస్తూ వస్తున్నామని ఆ ప్రతినిధి చెప్పారు. నటీనటులకు, ఇతర సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించి, రిజల్ట్ వచ్చిన తర్వాతే షూటింగ్ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
అందిన సమాచారం ప్రకారం జూన్ 26 నుంచి 'కసౌటీ జిందగీ కే '2 సీరియల్ షూటింగ్లో పాల్గొంటున్నాడు పార్థ్. శుక్రవారం అతనికి కరోనా లక్షణాలు కనిపించాయి. తీవ్రమైన జ్వరంతో బాధపడిన అతను ఆ మరుసటి రోజు టెస్ట్ చేయించుకున్నాడు. ఆదివారం పాజిటివ్గా తేలింది. పార్థ్ ఇద్దరు నటులతోటే సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ఒకరు అతని సోదరి పాత్రధారి కాగా, మరొకరు కీలక పాత్రధారి కరణ్ పటేల్. టీవీ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. పార్థ్ ఇటీవల తన కజిన్స్ను కలుసుకోడానికి ముంబై నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చాడు. అతడికి కొవిడ్-19 సోకడానికి ఈ ప్రయాణం కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.