అయోధ్య రామమందిరంపై సినిమా తీస్తానంటున్న డేరింగ్ హీరోయిన్!
on Apr 1, 2020
పాత్రల ఎంపికలో, సబ్జెక్టుల ఎంపికలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీరే వేరు. గత ఏడాది ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేసిన 'జడ్జ్మెంటల్ హై క్యా' సినిమాలో విపరీతంగా ప్రవర్తించే యువతిగా నటించిన ఆమె, 'మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' మూవీలో వీరవనితగా కనిపించి మెప్పించింది. ఈమధ్యే 'పంగా' మూవీలో స్ఫూర్తిదాయకమైన పాత్ర చేసింది. లేటెస్టుగా తమిళనాడు మాజీ ముఖ్యమంతి జయలలిత బయోపిక్ 'తలైవి'లో టైటిల్ రోల్ చేస్తోంది.
కాగా ఇటీవల ఒక ఆన్లైన్ పోర్టల్తో లైవ్లో మాట్లాడిన కంగన, తాను త్వరలో అయోధ్య రామమందిరం నేపథ్యంలో తయారయ్యే సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. స్వీయ క్వారంటైన్ టైమ్లో రామాయణం చూస్తూ గడుపుతున్నానని ఆమె తెలిపింది. "రాత్రి రామాయణం చూశాను, ఎందుకంటే అయోధ్య సబ్జెక్టుపై నేనొక ఫిల్మ్ చేస్తున్నాను. ఆ టైమ్లో అలాంటి సీరియల్ను తియ్యడం నిజంగా అద్భుతం" అని చెప్పింది కంగన.
ఇప్పటికే అయోధ్య రామమందిరం సబ్జెక్టుకు సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ సిద్ధమైందనీ, రెండో డ్రాఫ్ట్ను కూడా సిద్ధం చేస్తున్నామనీ ఆమె తెలిపింది. "ఇప్పటికైతే ఇంతవరకే చెప్పగలను, త్వరలో అన్ని వివరాలూ ఇస్తాను" అని చెప్పింది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది ఆమె వెల్లడించలేదు. అయితే ఆమే స్వయంగా మెగాఫోన్ పట్టుకుంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గత 500 సంవత్సరాలుగా అయోధ్య రామమందిరం చుట్టూ అల్లుకున్న అంశాలతో ఈ సినిమా ఉంటుందని సమాచారం.