త్రివిక్రమ్ సినిమాతో తారక్కు భారీ ఆదాయం!
on Feb 19, 2020
తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. 'అరవింద సమేత.. వీరరాఘవ' తర్వాత ఆ ఇద్దరూ మరో సినిమా చెయ్యడానికి సిద్ధమవుతున్న విషయం కొంతకాలంగా వార్తల్లో నలుగుతోంది. తన తదుపరి సినిమా జూనియర్ ఎన్టీఆర్తోటే ఉంటుందని త్రివిక్రమ్ వెల్లడించాడు కూడా. ఇప్పుడు నిర్మాతల నుంచే ఆ ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్తో పాటు నందమూరి కల్యాణ్ రామ్ సంస్థ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నది. 2021 వేసవిలో ఈ సినిమాని విడుదల చేస్తామని నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేదీ, తారాగణం, సాంకేతిక నిపుణుల బృందం వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు.
తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్న విషయం విదితమే. ఆ సినిమాలో తన సన్నివేశాలు పూర్తయ్యాక, త్రివిక్రమ్ మూవీ సెట్స్ మీదకు ఆయన రానున్నాడు. కాగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ లోగో మారింది. మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ సంతకం చేసినట్లుగా ఉండే బ్యానర్ లోగోను 'జై లవకుశ' సినిమాకు వేరే డిజైన్తో మార్చారు. ఆ రెండూ తెలుగులో ఉండేవి. వాటిలో ఎన్టీఆర్ బొమ్మ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంగ్లీషులో డిజైన్ చేసిన బ్యానర్ లోగోలో ఒక చేయి పైకెత్తినట్లున్న ఎన్టీఆర్ షాడో బొమ్మ పసుపు రంగులో కనిపిస్తోంది. తారక్ 30వ సినిమాగా ఇది రూపొందనున్నది. ఈ సినిమాకి ఆయన పారితోషికం తీసుకోకుండా థియేట్రికల్ ప్రి బిజినెస్ విలువలో 40 శాతం వాటా తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ రూ. 100 కోట్లకు ఈ సినిమా అమ్ముడైతే, తారక్కు రూ. 40 కోట్లు అందనున్నాయి.