అక్కడే ఆగిపోతే.. ఇక కష్టం బాలయ్యా..?
on Dec 22, 2017
ఎంతమంది హీరోలు వచ్చినా.. వెళ్లినా.. టాలీవుడ్కు మూడు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్గా నిలిచారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గడం లేదు. రీఎంట్రీ తర్వాత చిరు సైరా నర్సింహారెడ్డి చేస్తుండగా.. నాగ్, వెంకీలు సంవత్సరానికి ఒకటీ అరా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అయితే బాలయ్య మాత్రం జెట్ స్పీడుతో దూసుకువెళుతున్నారు. కుదిరితే మూడు .. లేదంటే రెండు సినిమాలు అన్నట్లుగా ఉంది బాలయ్య వేగం. అందుకు ఆయనని అభినందించాల్సిందే. కానీ అగ్రకథానాయకులు నలుగురిలో బాలయ్య తప్పించి మిగిలిన ముగ్గురు తమ వయసుకు సెట్ అయ్యేవి.. కొత్తదనం ఉండే సినిమాలు ఎంపిక చేసుకుంటుంటే.. నటసింహాం మాత్రం ఇంకా మూస ధోరణిలోనే వెళుతున్నాడు.
"ఓ పది పవర్ఫుల్ డైలాగులు.. ఓ నాలుగు ఫైట్లు" ఇదే బాలయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న సూత్రం. ఇలాంటి సినిమాలను జనం వదిలేసి ఏళ్లు గడుస్తోంది. సరిగ్గా బాలయ్య మారదాం అనుకుంటున్న టైంలో బోయపాటి లాంటి డైరెక్టర్ అదే ఫార్మాట్లో సినిమాలు తీయడం అవి సూపర్హిట్ అవ్వడంతో.. ఇక అన్ని సినిమాలను అలాగే ఎంపిక చేసుకుంటూ వెళుతున్నారు బాలకృష్ణ. రీసెంట్గా కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జై సింహా" కూడా ఇలాగే ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తుంది. నిన్న విడుదల చేసిన టీజర్ చూస్తే.. బాలయ్య లుక్, డైలాగ్ డెలీవరి ఏ మాత్రం మారలేదు. నటసింహాం విన్యాసాలు చూసిన వారంతా ఆయన అక్కడే ఆగిపోయాడా.. ఇక మారడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.