టాప్ హీరోయిన్ రేంజ్ మళ్లీ సాధ్యమేనా?
on Nov 24, 2020
మొదట్లో వైఫల్యాలు ఎదుర్కొన్నా, పవర్స్టార్ పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' మూవీతో విజయాల బాట పట్టిన శ్రుతి హాసన్ కొంత కాలం క్రితం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలతో పనిచేసి, ముగ్గురితోనూ విజయాలు సాధించిన క్రెడిట్ను దక్కించుకుంది. రామ్చరణ్ జోడీగా 'ఎవడు'లో మంజు పాత్రను, అర్జు అర్జున్ జోడీగా 'రేసుగుర్రం'లో స్పందన పాత్రనూ చక్కగా పోషించి, ప్రేక్షకుల ఆదరణను పొందింది.
ఆ తర్వాత సూపర్స్టార్ మహేశ్ సరసన 'శ్రీమంతుడు' చిత్రంలో చారుశీల పాత్రలో మరింతగా రాణించడం ద్వారా మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. 'ప్రేమమ్'లో నాగచైతన్య సరసన సితార పాత్రలోనూ మెప్పించిన ఆమె, 2017లో పవన్ సరసన రెండోసారి 'కాటమరాయుడు' మూవీ చేశాక, అకస్మాత్తుగా అవకాశాలు కోల్పోయింది. మూడేళ్ల పాటు ఆమె ఏ భాషా చిత్రంలోనూ కనిపించకపోవడం గమనార్హం.
ఇప్పడు రవితేజ జోడీగా 'క్రాక్' మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, ముచ్చటగా మూడోసారి పవర్స్టార్తో 'వకీల్ సాబ్'లో కనిపించనున్నది. ఈ సినిమాల తర్వాత ఆమె మునుపటి వైభవాన్ని సాధిస్తుందేమో చూడాలి.