గుణశేఖర్ 'రుద్రమదేవి'కి థియేటర్ల కొరతతో జరిగిన అన్యాయం!
on Sep 20, 2020
'రుద్రమదేవి'.. డైరెక్టర్ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఏ నిర్మాతా ఆ సినిమాని తీసేందుకు ముందుకు రాకపోతే, తనే నిర్మాతగా మారి, ఆస్తులన్నీ అమ్మి, అవీ సరిపోకపోతే కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి గుణశేఖర్ తీసిన సినిమా. రుద్రమదేవిని గుణా టీమ్ వర్క్ప్ పేరిట తనే సొంతంగా నిర్మిస్తున్నానని ఎప్పుడైతే ఆయన ప్రకటించారో అప్పట్నుంచే ఆయన ఎందుకంత దుస్సాహసం చేస్తున్నాడంటూ ఇండస్ట్రీ వ్యక్తులే విమర్శిస్తూ వచ్చారు. అవేమీ పట్టించుకోని గుణశేఖర్ దేశంలోనే పేరుపొందిన ఇళయరాజా, తోట తరణి, అక్కినేని శ్రీకరప్రసాద్, నీతా లుల్లా లాంటి టాప్ టెక్నీషియన్స్తో; అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాశ్రాజ్, కృష్ణంరాజు, నిత్యా మీనన్ లాంటి భారీ తారాగణంతో రుద్రమదేవిని తీర్చిదిద్దారు.
పురుష చక్రవర్తుల కంటే మిన్నగా సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని వీరత్వంతో, ధీరత్వంతో పాలించిన పరాక్రమశాలి రుద్రమదేవి చరిత్రను తనదైన శైలిలో గుణశేఖర్ ఆవిష్కరించారు. ఆ సినిమా 2015 అక్టోబర్ 9న విడుదలైంది. తొలి మూడు రోజుల్లోనే రూ. 25 కోట్ల షేర్ సాధించింది. అయితే అక్టోబర్ 16న రామ్చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీ 'బ్రూస్లీ'ని రిలీజ్ చేయడం 'రుద్రమదేవి'కి తీవ్ర నష్టాన్ని కలగజేసింది. అత్యధిక సంఖ్యలో థియేటర్లను 'బ్రూస్లీ'కి ఇచ్చేయడంతో ఆర్థికంగా 'రుద్రమదేవి'కి దెబ్బ తగిలింది.
అందుకే 'బ్రూస్లీ' మూవీ విడుదలకు ముందు దర్శకరత్న దాసరి నారాయణరావు 'రుద్రమదేవి'కి కలుగుతున్న నష్టం గురించి మాట్లాడారు. "ఈ సినిమాకు సంబంధించి ఒక్కటే బాధ. ఇది వచ్చిన ఏడో రోజున మరో పెద్ద సినిమా వస్తోంది. సినిమా బాగుందని టాక్ వచ్చి, స్టాండ్ అవుతున్న 'రుద్రమదేవి'కి థియేటర్ల కొరత ఏర్పడబోతోంది. 16వ తేదీన గుంటూరులో ఏడు థియేటర్లలో ఈ సినిమాని తీసేస్తున్నారు. మిగతా చోట్ల కూడా ఇదే స్థితి. పెద్ద సినిమాలకు రెండు వారాలైనా గ్యాప్ ఇస్తుంటారు. ఇప్పుడు వారం గ్యాప్తోనే మరో పెద్ద సినిమా వస్తోంది. అదేమంటే ముందుగానే కమిట్మెంట్ అయ్యిందంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఇలా రావడం ఎవరు బాగుపడ్డానికి? ఎవరు నాశనం కావడానికి? ఎందుకు ఈ పోటీ? నా అనుభవంలో పెద్ద సినిమాలకు పండగలు అక్కర్లేదు. వాళ్ల సినిమా ఏ రోజు రిలీజైతే ఆ రోజే పెద్ద పండగ. 'రుద్రమదేవి'కి రెండు వారాల సమయం లభిస్తే వసూళ్ల విషయంలో చరిత్ర సృష్టిస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
కానీ తెలుగువారి చారిత్రక సంపదలో భాగమైన 'రుద్రమదేవి'పై తీసిన సినిమా కోసం తమ సినిమాను మరో వారం పోస్ట్పోన్ చేసుకుందామని 'బ్రూస్లీ' నిర్మాతలు భావించలేదు. 16వ తేదీన ఆ సినిమా విడుదలై, 'రుద్రమదేవి' బాగా ఆడుతున్న థియేటర్లనన్నింటినీ తీసుకుపోయింది. దాంతో 'రుద్రమదేవి'కి నష్టాలు తప్పలేదు.
Also Read