సినీ కార్మికుల కోసం సౌత్-నార్త్ స్టార్లు కలిశారు!
on Apr 6, 2020
దేశవ్యాప్తంగా చలనచిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన కాలం ఇది. థియేటర్లన్నీ మూతపడ్డాయి. షూటింగ్లు ఆగిపోయాయి. ఎక్కడివాళ్లక్కడే, ఎవరి ఇళ్లల్లోని వాళ్లక్కడే ఉండిపోయారు. దాంతో షూటింగ్ల మీద ఆధారపడి జీవనం సాగించే దినసరి కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి కరువై బతుకు బరువైన సందర్భం. టాలీవుడ్లో అలాంటి కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆవిర్భవించింది. అనేకమంది స్టార్లు, ఇతర సెలబ్రిటీలు దానికి తమవంతు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు సీసీసీ తరపున వాటిని అందించే కార్యక్రమం మొదలైంది. మిగతా అన్ని భాషల చిత్రసీమల్లోనూ ఇదే తరహా సహాయ కార్యక్రమాలను ఆయా భాషల నటులు నిర్వహిస్తున్నారు
ఈ సందర్భంలో దక్షిణ, ఉత్తర భాషా చిత్రసీమల స్టార్లతో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి, దాని ద్వారా వచ్చే డబ్బును సినీ కార్మికుల కోసం వెచ్చిస్తే.. బిగ్ బి అమితాబ్ బచ్చన్కు ఈ ఆలోచన రావడం ఆలస్యం.. టాలీవుడ్ నుంచి చిరంజీవి, కోలీవుడ్ నుంచి రజనీకాంత్, శాండల్వుడ్ నుంచి శివ రాజ్కుమార్, మాలీవుడ్ నుంచి మమ్ముట్టి, మోహన్లాల్, బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, దిల్జీత్ దోసాంజ్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, మరాఠీ తార సోనాలీ కులకర్ణి, బెంగాలీ స్టార్ ప్రసేన్జిత్ ఛటర్జీని కలిపి ఒక షార్మ్ ఫిల్మ్ తీశారు. 4.35 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిమ్కు 'ఫ్యామిలీ' అనే టైటిల్ పెట్టారు. లాక్డౌన్ ఉంది కదా.. మరి ఎప్పుడు, ఎలా కలిసి నటించారా? అనే సందేహం వస్తుంది కదా.. ఎవరి ఇంట్లో వాళ్లు నటించగా, దాని పర్ఫెక్టుగా ఎడిట్గా చేశారు. ఈ ఫిల్మ్ను బ్లాక్ అండ్ వైట్లో చిత్రీకరించారు.
సోఫాలో కూర్చున్న అమితాబ్ బచ్చన్ సన్గ్లాసెస్ ఎక్కడున్నాయో చూసి తీసుకురమ్మని పురమాయిస్తే, ఒకవైపు రణబీర్, ఇంకోవైపు దిల్జీత్ వాటి కోసం వెతకడం, రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్లాల్, శివ రాజ్కుమార్ తదితరులను అడుగుతున్నట్లు చూపించడం, వాళ్లంతా ఆ గ్లాసెస్ను తాము చూడలేదని చెప్పడం.. చివరకు అవి ఆలియా భట్ తలకు కనిపిస్తే, చేతులు మారుతూ చివరకు ప్రియాంకా చోప్రా వాటిని అమితాబ్కు అందించడం ఈ షార్ట్ ఫిలిమ్లో కనిపించే విషయం. విశేషమేమంటే వీరిలో ఏ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో నటించలేదు. ఎవరి ఇంట్లో వాళ్ల సన్నివేశాలను తీసి, కలిపి ఒకటిగా చేశారు. పైగా ఇందులో నటించిన వాళ్లు ఎవరి భాషలో వాళ్లు మాట్లాడారు.
చివరలో ఈ షార్ట్ ఫిల్మ్ను తీసిన ఉద్దేశాన్ని అమితాబ్ చెప్పకుంటూ వచ్చారు. "ఈ ఫిల్మ్లో నటించిన వాళ్లమెవరం మా ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. తమ పోర్షన్ను తమ ఇంటిలోనే చేశారు. మీరు కూడా ఇళ్లల్లోంచి బయటకు రావద్దు. కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్మి మీరు కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ ఫిల్మ్ రూపొందించడానికి ఇంకో కారణం కూడా ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటే. మేమంతా ఒక్కటే కుటుంబం. మా వెనుక మాకు సహకారం అందిస్తూ, మాతో పనిచేసే ఇంకా పెద్ద కుటుంబం ఒకటి ఉంది. వాళ్లు మా కార్మికులు, దినసరి వేతనజీవులు. లాక్డౌన్తో వాళ్లంతా నానా కష్టాలు పడుతున్నారు. అందువల్ల మేమంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి, స్పాన్సర్లు, టీవీ చానళ్లతో కలిసి ఒక ఫండ్ను నెలకొల్పాలనుకున్నాం. ఈ ఫండ్ను ఆ కార్మికులకు, దినసరి వేతనజీవులకు పంచుతాం. ఈ క్లిష్ట కాలంలో వాళ్లకిది కొంత వెసులుబాటును కలిగిస్తుంది" అని ఆయన తెలిపారు.
ఈ షార్ట్ ఫిల్మ్కు సోనీ టీవీ సహకారం అందిస్తుండగా, కల్యాణ్ జ్యూయలర్స్ స్పాన్సరర్గా వ్యవహరిస్తోంది. సోమవారం రాత్రి 9 గంటలకు ఈ షార్ట్ ఫిల్మ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ చానల్స్లో ప్రసారమైంది.