రూ. 50 కోట్లతో స్టూడియో కట్టబోతున్నా.. హైకోర్టుకు తెలిపిన డైరెక్టర్ శంకర్!
on Aug 10, 2020
డైరెక్టర్ ఎన్. శంకర్కు కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కేవలం రూ. 5 లక్షలకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై సోమవారం వాదనలు జరిగాయి. మార్కెట్ విలువ ప్రకారం శంకర్కు ప్రభుత్వం కేటాయించిన భూమి విలువ రూ. 2.5 కోట్లు ఉంటుందని కౌంటర్లో హెచ్ఎండీఏ పేర్కొంది. మణికొండ సమీపంలోని శంకర్పల్లిలో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఐదెకరాల భూమిని పొందడానికి ఏ రకంగా అర్హులో తెలపాలని ఇదివరకు శంకర్ను విచారణ సందర్భంగా హైకోర్టు అడిగింది.
తాను ఆ స్థలంలో రూ. 50 కోట్లతో స్టూడియో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాననీ, ఆ స్టూడియో నిర్మాణం పూర్తయితే 300 మందికి ఉపాధి చేకూరుతుందని న్యాయస్థానానికి సోమవారం విచారణ సందర్భంగా శంకర్ తెలియజేశారు. అయితే రూ. 2.50 కోట్ల విలువైన భూమిని ఏ ప్రాతిపదికన రూ. 5 లక్షలకు కేటాయించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరీంనగర్కు చెందిన జె. శంకర్ అనే నిరుద్యోగి డైరెక్టర్ శంకర్కు ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించడాన్ని సవాలుచేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
శంకర్కు కేటాయించిన తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మరికొందరికి కూడా ఇలాంటి కేటాయింపులే జరిపిందనీ, వాటికి సంబంధించి కేసులు కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయనీ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ రకమైన కేటాయింపులను ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం అనంతరం విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.