ఎక్స్క్లూజివ్: సంజయ్ దత్కు కేన్సర్ అని ఎలా బయటపడిందంటే...
on Aug 13, 2020
శ్వాస పీల్చడంలో ఇబ్బంది కలుగుతుండటంతో ట్రీట్మెంట్ కోసం ఇటీవల సంజయ్ దత్ ముంబైలోని లీలావతి హాస్పిటల్కు వెళ్లారు. వెంటనే ఆయనను ఐసీయూలో అడ్మిట్ చేయించి, ఛాతీ దగ్గర అసౌకర్యంగా ఉందనే ప్రాథమిక అంచనాతో తాత్కాలిక చికిత్స అందించారు. సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తను బాగానే ఉన్నానంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్కు హామీ ఇచ్చారు. అయితే ఒక రోజు తర్వాత, ఆయనకు నాలుగో దశ ఊపిరితిత్తుల కేన్సర్ అనే విషయం వెల్లడైంది.
తనకు కొవిడ్-19 లక్షణాలు కనిపిస్తున్నాయని మొదట సంజయ్ దత్ భావించారు. కానీ టెస్ట్లో నెగటివ్ అని తేలినా ఆ లక్షణాలు అలాగే కొనసాగాయి. దాంతో వైద్యులు ఆయనకు సీటీ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్, ఆ తర్వాత పీఈటీ (పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కాన్ చేయించారు. అప్పుడు ఆయనకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం బయటపడింది.
లీలావతి హాస్పిటల్ వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్ట్ 8న సంజయ్ దత్ శ్వాస సరిగా అందడం లేదని డాక్టర్ను సంప్రదించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండటంతో, తనకు అది సోకిందేమోనని సందేహించిన ఆయన ఇంట్లోనే ఆక్సీమీటర్తో చెక్ చేసుకున్నారు. తనలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయని గుర్తించారు. దాంతో హాస్పిటల్కు వెళ్లిన ఆయనకు కొవిడ్ టెస్ట్ చేశారు. అందులో ఆయనకు నెగటివ్ అని వచ్చింది. అయినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ వచ్చారు.
దాంతో సోదరి ప్రియా దత్ను తీసుకొని లీలావతి హాస్పిటల్కు వెళ్లారు సంజయ్. ఆయన కుడి ఊపిరితిత్తిలోకి గాలి వెళ్లడం లేదని వైద్యులు గుర్తించారు. సీటీ స్కాన్ ద్వారా అందులో నీరు చేరిందనే విషయంతో పాటు రెండు ఊపిరితిత్తుల్లో ఒక్కో పుండు ఉన్నట్లు బయటపడింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఎక్సర్సైజులు ఎక్కువవడం ద్వారా కానీ, లేదా కేన్సర్ వల్ల కానీ అవి ఏర్పడి ఉండవచ్చని డాక్టర్లు చెప్పారు. మొదట నీరుని తొలగించారు. అది 1.5 లీటరు దాకా ఉంది. రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు సంజయ్.
అప్పుడు ఆయనకు పీఈటీ స్కాన్ చేశారు. దాని రిజల్ట్ వచ్చేలోగా ఊపిరితిత్తుల్లోని నీటిలో కేన్సర్ కణాలున్నాయని సోమవారం నాడు హాస్పిటల్లోని హిస్టోపాతాలజీ డిపార్ట్మెంట్ గుర్తించింది. పీఈటీ స్కాన్ కూడా దాన్ని ధ్రువీకరించింది. ఆ వెంటనే వైద్యులు ఆయనకు కౌన్సిలింగ్ నిర్వహించి, విషయం చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్జరీ సాధ్యం కాదనీ, కీమోథెరపీ ఒక్కటే ఆప్షన్ అనీ సంజయ్కు వైద్యులు తెలిపారు. వెంటనే చికిత్స మొదలు పెట్టాలనీ, ఆందోళన చెందకుండా ఉంటే కోలుకోవడానికి అవకాశాలు ఉన్నాయనీ వారు చెప్పారు. కాగా ఆ కేన్సర్కు సంబంధించి సాధ్యపడే ట్రీట్మెంట్స్ గురించిన మరింత సమాచారం కోసం ఒక ఆంకాలజిస్ట్ను సంజయ్ సంప్రదించారనీ, విదేశాల్లో ట్రీట్మెంట్కు అవకాశాలను పరిశీలిస్తున్నారనీ బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
సంజయ్ సన్నిహిత స్నేహితుడొకరు చెప్పిన దాని ప్రకారం తనకు కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజిలో ఉన్నదనే విషయం వెల్లడవగానే ఆయన బాగా డీలాపడి పోయారు. ఆయన పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. ప్రస్తుతం వాళ్లు దుబాయ్లో తల్లి దగ్గర ఉన్నారు. ఏదేమైనా ఈ వార్త తెలియగానే వాళ్లు కూడా దిగాలు పడ్డారు. ఏదేమైనా, తనకు ఎదురైన తీవ్రమైన అనారోగ్య స్థితి నుంచి సంజయ్ దత్ కోలుకోవాలని ఆశిద్దాం.