లేడీ అమితాబ్ అనే కీర్తిని విజయశాంతి ఎలా సంపాదించుకున్నారు?
on Oct 24, 2020
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే పురుషాధిక్యం చాలా ఎక్కువగా ఉండే ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో విజయశాంతి లేడీ అమితాబ్ అనే కీర్తిని ఎలా సంపాదించుకోగలిగారు? ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఆమెను అడిగితే ఆమె నుండి వచ్చిన సమాధానం "ఛాలెంజ్" అని. ఆమె 1979లో చిత్రసీమలో అడుగుపెట్టారు. మొదట ఓ తమిళ చిత్రం చేశారు. 1980లో సూపర్ స్టార్ కృష్ణ సరసన నాయికగా 'కిలాడీ కృష్ణుడు'తో తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు.
"నాకు వచ్చిన పాత్రలతో ప్రూవ్ చేసుకున్నాను. అక్కడితో ఆగకుండా 'హీరోలకూ, మాకూ ఏమిటి తక్కువ. ఒక్క ఫైటే కదా..' అని అది కూడా చేసేశాను, సాధించేశాను. అంటే గట్స్.. కొట్లాడే మనస్తత్వం ఉంది. భయపడటం విజయశాంతి హిస్టరీలోనే లేదు. కొన్నిసార్లు వేరే నిర్మాతలను రిస్క్లో పెట్టడం ఎందుకని మేమే నిర్మించేవాళ్లం. ఉదాహరణకు 'కర్తవ్యం' మా బేనర్ మీద చేశాం అని చెప్పారు విజయశాంతి. ఆ చిత్రంలోని పాత్రతో ఆమె జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న విషయం మనకు తెలుసు.
"ఆ రోజు మావారు శ్రీనివాస ప్రసాద్ రిస్క్ చేశారు. హిట్టయితే అవుతుంది, లేకపోతే లేదు అనుకున్నాం. ఎదుటి నిర్మాతలు నష్టపోకూడదనే అభిప్రాయంతో ఆయన ప్రొడక్షన్ మొదలుపెట్టారు. అది హిట్టవడంతో మిగతా నిర్మాతలు వచ్చారు. 'పోలీస్ లాకప్' లాంటి సినిమాలు చేశారు. దాసరిగారు 'ఒసేయ్ రాములమ్మా' తీశారు. మొదటడుగు రిస్క్ని మేం తీసుకున్నాం, సక్సెస్ అయ్యాం అని తెలిపారు లేడీ అమితాబ్ విజయశాంతి.