సింహాద్రి ఉంగరాన్ని చోరీ చేసిన నితిన్... కట్టేసిన పూజారి...
on Apr 2, 2018
పాపం దేవుని ఆశీర్వాదం కోసం వెళ్లిన నితిన్ పై దొంగతనం ఆరోపణలు మోపారు. అదేంటీ అనుకుంటున్నారా..అవునండీ విశాఖపట్టణంలోని సింహ్రాద్రి అప్పన్న సన్నిధిలో సింహాద్రీశుని ఆశీర్వాదం తీసుకుందామని నితిన్ సింహాచలం వెళ్లాడు. అయితే అక్కడ నితిన్ ను దొంగతనం చేశాడని తాళ్లతో బంధించారు. ఆలయ అలంకారి కరి సీతారామాచర్యాలు నితిన్ ను తాళ్లతో బంధించి.. స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన నితిన్ తో ‘ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ దొంగతనం మోపారు.
దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన నితిన్...‘నేను తియ్యలేదండి కావాలంటే చెక్ చేసుకోండి’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో మళ్లీ ఆయన ‘ స్వామివారి ఉంగరం పోయింది... చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం.... మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే.’ అంటూ స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు. దీంతో నితిన్ అలాగే ఉండిపోయారు. ఆ తరువాత మరికొంత మందిని కరి సీతారామాచార్యులు బంధించి తేవడం, రాజగోపాల్ ప్రశ్నించడం జరిగింది. వారిలో కొంతమంది భక్తులు అక్కడే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా చూసిన ఆలయ అధికారులు నవ్వుకుంటూ అసలు విషయం బయటపెట్టారు. లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు వినోదోత్సవంలో భాగంగా దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారట. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించామని... ఇందులో భాగంగానే నితిన్ పలువురు భక్తులు దొంగలుగా మారారని చెప్పారు. ఆఖరికి అయ్యవారి ఉంగరం దొరికిందని చెప్పడంతో వారంతా నవ్వుకొని ఊపిరిపీల్చుకున్నారట.