పెళ్లిరోజున పెళ్లి ఫొటో షేర్ చేసి, "మంచి" మాటలు చెప్పిన గుణశేఖర్!
on Oct 17, 2020
భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. జీవితాంతం ఒకరికి ఒకరు అన్నట్లుగా, తోడునీడగా కలిసి జీవించేది ఆ ఇద్దరే. పెళ్లయిన క్షణం నుంచీ ఆ ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. కొత్త జీవితాలు మొదలవుతాయి. కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. తమదైన ఒక కుటుంబం మొదలవుతుంది. వేర్వేరు వాతావరణాలు, పరిస్థితులు, సంస్కృతుల నుంచి వచ్చిన వాళ్లు ఆ క్షణం నుంచీ ఒకరినొకరు తెలుసుకుంటూ, ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకుంటూ, పరస్పరం గౌరవించుకుంటూ, అనుక్షణం ప్రేమించుకుంటూ వస్తే.. ఆ వైవాహిక జీవితాన్ని మించిన ఆనందకర జీవితం ఇంకేముంటుంది!
ఇదంతా చెప్పడం ఎందుకంటే.. ఈరోజు టాలీవుడ్లోని అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరైన గుణశేఖర్, ఆయన భార్య రాగిణి పెళ్లిరోజు. అప్పుడప్పుడు మాత్రమే తన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకొనే ఆయన ఈసారి తమ యానివర్సరీ రోజును సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పంచుకున్నారు. రాగిణికి తాళి కడుతున్న పిక్చర్ను షేర్ చేసిన ఆయన కవితాత్మకంగా మంచి వివాహం, మంచి దాంపత్యం, మంచి సమాజం గురించి చెప్పిన మాటలు ఆలోచింపజేసేట్లు ఉన్నాయి. అదే సమయంలో ఒక బాధ్యత కలిగిన పౌరుడు కూడా ఆయనలో కనిపించాడు.
“మంచి వివాహమే మంచి దాంపత్యం
మంచి దాంపత్యమే మంచి సంతానం
మంచి సంతానమే మంచి సమాజం
మంచి సమాజమే మంచి ప్రపంచం”
ఇప్పట్లో.. "మంచి”మాటలంటే విసుగ్గానే వుండొచ్చు..కానీ ఈ భూమ్మీద మనుషులుగా మసలుకోడానికి అవే అసలైన మార్గాలుగా తెలుస్తాయి !#HappyMarriageAnniversary" అని ఆయన రాసుకొచ్చారు.
పని విషయానికి వస్తే, మహాభారతం ఆదిపర్వంలోని ఓ ఘట్టం ఆధారంగా మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఆయన 'శాకుంతలం' చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించారు. దాని తర్వాత ఆయన రానాతో 'హిరణ్యకశ్యప'ను రూపొందించనున్నారు.
Also Read