తెలంగాణ సినీ అవార్డ్స్కు కేసీఆర్ గ్రీన్సిగ్నల్..?
on Nov 5, 2016
తెలుగు సినిమాలో మరో కొత్త అధ్యాయం ప్రారంభకానుంది. ఉత్తమ చలనచిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున అవార్డులను ఇవ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు వరకు ఉమ్మడి ప్రభుత్వం నంది అవార్డులతో పాటు వివిధ కేటగీరిల కింద పురస్కారాలను బహూకరించేది. అయితే 2014 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడంతో పురస్కారాలు ఆగిపోయాయి. ఈ విషయాన్ని సినీ ప్రముఖులు ఇరు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం మొదట ఏపితో కలిసి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది..
అయితే ఆంధ్రా ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తరపునే పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పురస్కారాలు ఆంధ్రా ప్రాంతంకు సంబంధించిన వారి పేర్లతోనే ఉండేవి. తెలంగాణకు చెందిన ప్రముఖుల పేర్లతో అవార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈమేరకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన కమిటీని నియమించింది. ఆ కమిటీ పైడి జయరాజు, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, దాశరథి, చక్రిల పేరిట అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక ఈ నివేదికకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేయడమే తరువాయి.
ఆ అవార్డులు ఒక్కసారి పరిశీలిస్తే:
* జాతీయస్థాయి సినీ ప్రముఖునికి పైడి జయరాజ్ అవార్డు
* తెలంగాణ సినీ ప్రముఖునికి కాంతారావు అవార్డ్
* ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి ప్రభాకర్ రెడ్డి అవార్డ్
* ఉత్తమ గీత రచయితకు దాశరథి అవార్డు
* ఉత్తమ సంగీత దర్శకుడికి చక్రి అవార్డు