మన హీరోయిన్లకు డబ్బులే ముఖ్యమా??
on Nov 17, 2016
నాలుగు రాళ్లు వెనకేసుకోవడం ఎలాగో మన కథానాయికలకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదేమో? లక్షలు వచ్చి పడే ఏ మార్గాన్నీ వాళ్లు వదులుకోరు. తాజాగా గాలి ఇంటి పెళ్లితో ఈ విషయం మరోసారి రుజువైంది. గాలి జనార్థనరెడ్డి అక్రమ సంపాదన, జైలు జీవితం, కేసులు ఇవన్నీ తెలిసిన సెలబ్రెటీలెవ్వరూ ఆ ఇంటి పెళ్లికి వెళ్లడానికి సాహసించలేదు. అయితే మన సినిమావాళ్లు మాత్రం అక్కడకు పొలోమంటూ వెళ్లిపోయారు. వెళ్లడమే కాదు.. ఆడారు, పాడారు ఆ పెళ్లికి ఓ కొత్త శోభ తీసుకొచ్చారు. దానికి కారణం డబ్బు. అడినవాళ్లకు అడిగినదానికంటే ఎక్కువ డబ్బులు విసిరేస్తే, దాన్ని అందుకోవడానికి మనవాళ్లెప్పుడూ తయ్యారే కదా.
అందుకే గాలిని చుట్టుకొన్న కేసులు, చేసిన తప్పులు ఇవన్నీ గాలికి వదిలేసి ఆ పెళ్లికి హాజరయ్యారు. తమన్నాకి ఏకంగా రూ.70 లక్షలు, రకుల్కి రూ.20 లక్షలు ముట్టాయని టాక్ నడుస్తోంది. ఇదంతా పెళ్లికి వెళ్లి డాన్సింగులు చేసినందుకు దక్కిన పారితోషికం. ప్రియమణి, కేథరిన్లకూ కొన్ని లక్షలు పారితోషికం ఇచ్చారట. పెళ్లి తంతుకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సాయికుమార్ కి రూ.20 లక్షలు దక్కాయని తెలుస్తోంది. మొత్తానికి గాలి వారి పెళ్లిపుణ్యమా అంటూ ఎంతో కొంత సంపాదించుకొన్నారు మన సినీ తారలు. అవీ కొత్త నోట్లే సుమా.