ప్రభాస్20 నిర్మాతలను సోషల్ మీడియాలోకి ఈడ్చిన ఫ్యాన్స్! రచ్చ రచ్చే!!
on Apr 7, 2020
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 20వ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. లాక్డౌన్కు ముందు జార్జియా షెడ్యూల్ను హడావిడిగా ముగించుకొని వచ్చింది చిత్ర బృందం. ఈ మూవీని కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణా మూవీస్తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మస్తోంది. 'సాహో' మూవీని నిర్మించింది కూడా ఈ సంస్థే. మార్చి 17న తమ అధికారిక ట్విట్టర్ పేజీలో "జార్జియాలో మరో షెడ్యూల్ ముగిసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా జార్జియాలో ఈ షెడ్యూల్ పూర్తి చేయడానికి సహకరించి సాయం చేసిన టీమ్కు బిగ్ థాంక్స్. ముఖ్యంగా, త్వరలో ఫస్ట్లుక్ వస్తుంది" అని నిర్మాతలు పోస్ట్ చేశారు.
ఈ పోస్టే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి కారణంగా మారింది. తమ హీరో ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తూ వస్తున్న వాళ్లకు ఇంతవరకూ అలాంటిదేమీ రాకపోవడంతో ఆగ్రహానికి గురవుతున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ అని నిర్మాతలే చెప్పారు కాబట్టి మార్చి 25 ఉగాది సందర్భంగా ఆ లుక్ వస్తుందని వారెంతగానో ఆశించారు. కానీ వారి ఆశలు నీరుకారిపోయాయి. ఉగాదికి ప్రభాస్ 20వ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కాదు కదా, ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ 'టీమ్ ప్రభాస్' అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా సోమవారం 'బ్యాన్ యువీ క్రియేషన్స్' అనే స్లోగన్ను ఎత్తుకున్నారు. ఆ పేరుతో హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎంతగా అంటే, ట్విట్టర్ ప్లాట్ఫామ్పై ఇండియా ట్రెండ్స్లో ఉండేంతగా!
యువీ క్రియేషన్స్ను టార్గెట్గా చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్.. "ప్రభాస్20 సినిమా 2018 సెప్టెంబర్లో లాంచ్ అయ్యింది. 20 నెలలు గడిచాయి. ఫ్యాన్స్కు మీరు కనీసం మూవీ టైటిల్ కూడా ఇవ్వలేకపోయారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే 'బ్యాన్ యువీ క్రియేషన్స్' అనే ట్యాగ్ను ఉపయోగించాల్సిందిగా వాళ్లు ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ కోరారు. దాంతో కొద్ది సేపట్లోనే ఆ హ్యాష్ట్యాగ్ ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. యువీ క్రియేషన్స్ సంస్థ కనీసం ప్రభాస్20 పూజా కార్యక్రమం ఫొటోలను సైతం విడుదల చేయకపోవడం బాధాకరమని ఫ్యాన్స్ పేర్కొన్నారు. తాము ఇదంతా చేస్తోంది మీమీద కోపంతో కాదనీ, ప్రభాస్ మీద ప్రేమతోనని వాళ్లు యువీ క్రియేషన్స్ను ట్యాగ్ చేస్తూ చెప్పారు.
సోషల్ మీడియాలో ఇది రచ్చరచ్చ అవుతుండటంతో యువీ క్రియేషన్స్ ఎట్టకేలకు స్పందించింది. మంగళవారం ఉదయం ట్విట్టర్ అకౌంట్లో, "మనం ఇప్పుడు ప్రపంచ మహమ్మారి మధ్యలో ఉన్నాం. ప్రస్తుత పరిస్థితిలో అనేకమంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ స్థితిలో మా మొత్తం పనులను వాయిదా వేసుకున్నాం. ఇది ముగిశాక, అనేక అప్డేట్స్తో వస్తామని ప్రామిస్ చేస్తున్నాం. అందరినీ ఇంట్లో సురక్షితంగా ఉండమని అభ్యర్థిస్తున్నాం" అని పోస్ట్ చేశారు.
ఈ సమాధానం టీమ్ ప్రభాస్కు సంతృప్తినివ్వలేదు. "ఇది కేవలం ప్రభాస్20కి మాత్రమే వర్తిస్తుంది, కారణం మీ వల్లే. మిగతా సినిమా టీమ్లు అప్డేట్స్ ఇస్తున్నాయి. మేం ట్రైలర్ అడిగామా, టీజర్ అడిగామా? ఇప్పటికే మీ దగ్గర ఉన్న ఫస్ట్లుక్, టైటిల్ అడుగుతున్నాం" అని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత, "ఇక ఆ ట్యాగ్ (బ్యాన్ యువీ క్రియేషన్స్)ను ఉపయోగించవద్దని ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్లు దేన్నీ రిలీజ్ చేసే ఉద్దేశంలో లేరు" అని పోస్ట్ చేశారు.
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్కూ, ప్రభాస్ నిర్మాతలకూ మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం చివరకు దేనికి దారితీస్తుందో చూడాలి. నిజానికి యువీ క్రియేషన్స్ అనేది ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ లాంటిదే. అందులోని భాగస్వాములు ప్రభాస్ కజిన్, స్నేహితులు కావడం గమనార్హం. తన ఫ్యాన్స్ ఇలా ఫైర్ అవుతుండటంలో ప్రభాస్కూ భాగం ఉందనుకోవాలి. వాళ్ల వేడిని చల్లార్చడానికి అతను ఏం చేస్తాడో చూడాలి.
Also Read