కార్తీక్ను తీసేయడం వల్ల కరణ్ జోహార్కు రూ. 20 కోట్ల నష్టం!
on Apr 17, 2021
సూపర్ హిట్ ఫిల్మ్ 'దోస్తానా'కు సీక్వెల్గా 'దోస్తానా 2' తీస్తున్నామని కరణ్ జోహార్ బ్యానర్ ధర్మా ప్రొడక్షన్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, ఆ సినిమాలో ఎవరు నటిస్తారా?.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. 2008లో వచ్చిన ఒరిజినల్లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంక చోప్రా నటించారు. సీక్వెల్లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య లల్వానీ నటిస్తున్నారనే విషయం వెల్లడైనప్పుడు ఫ్యాన్స్ ఎక్జయిట్ అయ్యారు. అయితే లేటెస్ట్గా ప్రొఫెషనల్ రీజన్స్తో కార్తీక్ ఆర్యన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలియడంతో వారు షాక్కు గురయ్యారు.
కరణ్ జోహార్తో కార్తీక్కు పడకపోవడమే దీనికి కారణమంటూ ప్రచారంలోకి వచ్చింది. ఏదేమైనా కార్తీక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల నిర్మాతలకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందనే విషయం తెలుసా? 'బాలీవుడ్ హంగామా'లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 24 రోజుల షూటింగ్ జరపగా, కార్తీక్ 20 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత స్క్రిప్టులో సెకండాఫ్కు సంబంధించి కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేసి, మార్పులు చేయాల్సిందిగా కోరాడు. ఇది కరణ్ జోహార్ను అప్సెట్కు గురిచేసింది. అతడిని తీసేసి వేరొకర్ని తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీంతో కార్తీక్తో తీసిన సీన్లు పనికిరాకుండా పోయాయి. దీని వల్ల నిర్మాతలకు రూ. 20 కోట్లు నష్టం వాటిల్లినట్టయింది.
కార్తీక్ ఆర్యన్ ప్లేస్లో మరో యాక్టర్ను తీసుకోవాలనే కరణ్ జోహార్ నిర్ణయం వివాదాలకు తావిచ్చింది. దీంతో లేటెస్ట్గా "వృత్తిపరమైన పరిస్థితుల కారణంగా, డిగ్నిఫైడ్ సైలెన్స్ను మెయిన్టైన్ చేస్తూ, కొలిన్ డికున్హా డైరెక్ట్ చేస్తున్న 'దోస్తానా 2'కు క్యాస్టింగ్లో మార్పులు చేయబోతున్నాం. త్వరలో అఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయండి." అని ధర్మా ప్రొడక్షన్స్ ప్రకటించింది.
కార్తీక్ ప్లేస్లో విక్కీ కౌశల్ లేదా రాజ్కుమార్ రావ్ వచ్చే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. చూద్దాం.. జాన్వీ కపూర్తో ప్రేమలో పడే చాన్స్ ఎవరికి లభిస్తుందో?