గెంతులేసి వెళ్లిపోయే రోల్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ కావాలి!
on Nov 8, 2019
"ఎప్పుడూ ఒకే తరహాలో హీరోయిన్ గెంతులేసి వెళ్లిపోవడం కాకుండా డిఫరెంట్ రోల్స్ చెయ్యాలి" అంటోంది హైదరాబాదీ అమ్మాయి ఈషా రెబ్బా. ఆమె హీరోయిన్గా నటించిన 'రాగల 24 గంటల్లో' మూవీ నవంబర్ 15న విడుదలవుతోంది. శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆమె సత్యదేవ్ జోడీగా నటించింది. ఈ సందర్భంగా 'తెలుగుఒన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటివరకూ తను నటించిన సినిమాల్లో 'అమీ తుమీ'లో చేసిన పాత్ర ఎక్కువ ఇష్టమని చెప్పింది.
"నేను చాలా స్టోరీస్ వింటాను. కథలు వినడంలో నాకు కొంచెం ఓపిక ఉంది. ఎన్ని గంటలు చెప్పినా వింటాను. అందులో నాకు నచ్చినవి నేను చేస్తుంటా. కొన్ని నచ్చక రిజెక్ట్ చేస్తున్నా. కొన్ని కేరెక్టర్స్ చూసినప్పుడు ఇలాంటివి నాకూ వస్తే బాగుండుననిపిస్తుంది. రానివి ఎక్స్పెక్ట్ చేసినా వేస్టే. వచ్చినప్పుడు చెయ్యాలి. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నా నాకిష్టమే. ఎక్కువగా 'అమీ తుమీ' ఇష్టం. అందులో నేను చేసిన కేరెక్టర్ అంటే చాలా ఇష్టం. దాన్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లే ఉంటుంది. నేను చేసిన పాత్రలన్నీ ఒకదానికొకటి భిన్నమైనవే.
'అ!'లో లెస్బియన్ రోల్ చేశాను. ఆ కేరెక్టర్ను నాకు చెప్పినప్పుడు చాలా బాగుందనిపించింది. ఒక డిఫరెంట్ రోల్ అనిపించింది. "ఎప్పుడు షూటింగ్ ప్రశాంత్?" అని డైరెక్టర్ని అడిగాను. మచి రోల్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఎక్కువ ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదు. ఆ కేరెక్టర్ను ఆడియెన్స్ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. అలాంటి రోల్స్ రావాలి, చెయ్యాలి. ఎప్పుడూ ఒకే తరహాలో హీరోయిన్ గెంతులేసి వెళ్లిపోవడం కాకుండా డిఫరెంట్ రోల్స్ చెయ్యాలి. 'అ!'లో కాజల్ అగర్వాల్, రెజీనా, నేను, నిత్యా మీనన్.. నలుగురం డిఫరెంట్ కేరెక్టర్స్ చేశాం. అలాంటి రోల్స్ ఎక్కువగా రావు. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది" అని తెలిపింది ఈషా.