'దృశ్యం 2'లో వెంకీ సీన్లు పూర్తి
on Apr 15, 2021
మలయాళం హిట్ ఫిల్మ్ 'దృశ్యం 2' తెలుగు రీమేక్ షూటింగ్ చకచకా సాగిపోతోంది. సెట్స్ మీదకు వెళ్లిన నెలరోజుల్లోనే తన పోర్షన్ను విక్టరీ వెంకటేశ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు. వెంకటేశ్, మీనా, కృతిక జయకుమార్, ఎస్తర్ అనీల్, డైరెక్టర్ జీతు జోసెఫ్ ఉన్న ఓ ఆన్ లొకేషన్ పిక్చర్ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన సురేశ్ ప్రొడక్షన్స్, "@VenkyMama wraps his portion of the shoot for #Drishyam2 ." అని ట్వీట్ చేసింది.
'దృశ్యం' తరహాలోనే 'దృశ్యం 2'లోనూ వెంకటేశ్, మీనా భార్యాభర్తలుగా నటిస్తుండగా, వారి కూతుళ్లుగా కృతిక, ఎస్తర్ నటిస్తున్నారు. మోహన్లాల్, మీనా నటించిన ఒరిజినల్ 'దృశ్యం 2' నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజై వీక్షకాదరణ పొందింది. దాంతో తెలుగులోనూ దాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. 'దృశ్యం' తెలుగు వెర్షన్కు సీనియర్ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, ఈ సీక్వెల్కు ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ స్వయంగా మెగాఫోన్ పట్టుకున్నాడు.
ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఆంటోనీ పెరంబవూర్, శ్రీప్రియ భర్త రాజ్కుమార్ సేతుపతితో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేశ్బాబు నిర్మిస్తోన్న 'దృశ్యం 2'కు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కీలకమైన పోలీస్ ఆఫీసర్ రోల్ను సంపత్ రాజ్ చేస్తుండగా, ఒరిజినల్లో నటించిన నరేశ్, నదియా ఈ సీక్వెల్లోనూ తమ పాత్రలను నిలబెట్టుకున్నారు.
మార్చి 1న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కాగా, ఆ వెంటనే సెట్స్ మీదకు వెళ్లింది. పక్కా ప్లానింగ్తో నిర్మాతలు వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.