కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న డైరెక్టర్!
on Jul 2, 2020
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీదకు మరో డైరెక్టర్ కుమారుడు హీరోగా రావడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు తెలుగులో దర్శకుల కుమారులు హీరోలుగా సక్సెస్ అయినవాళ్లు అంతలేరని చెప్పాలి. దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చినా విజయాలు అందుకోలేదు. మరో దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కి తెలుగులో విజయాలు లేకున్నా, తమిళంలో హీరోగా సెటిల్ అయ్యాడు. సతీష్ వేగేశ్న కుమారుడు ఈ సెంటిమెంట్ మార్చాలని కోరుకుందాం.
'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం', 'ఎంత మంచివాడవురా' సినిమాలకు దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న ఉన్నారు కదా. ఆయన కొత్త సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ఆయన కుమారుడు సమీర్ హీరో. అతడికి అదే తొలి సినిమా. కరోనా తగ్గిన తరవాత షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.