అవసరాలతో నీలకంఠ 'సెకండ్ షో'
on Apr 22, 2020
ఓ పదిహేడేళ్ల క్రితం... బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్గా నేషనల్ అవార్డ్ అందుకున్న 'షో' సినిమా గుర్తుందా? నీలకంఠ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు స్క్రీన్ప్లే విభాగంలోనూ నేషనల్ అవార్డ్ వచ్చింది. ఒక్క సినిమాతో నీలకంఠ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. తర్వాత ఆయన తీసిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కానీ, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకంటే... 'షో'కి సీక్వెల్ తీయడానికి నీలకంఠ రెడీ అవుతున్నారు.
అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా నీలకంఠ దర్శకత్వంలో 'సెకండ్ షో' అని ఒక సినిమా రూపొందనుంది. రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ నిర్మించనున్నారు. ఇది 'షో' సినిమాకి సీక్వెల్. అందుకని, 'సెకండ్ షో' అని టైటిల్ పెట్టారు. 'షో' టైపులో మాంచి డ్రామాతో ఈ సినిమా తెరకెక్కిస్తారట. ఆల్రెడీ బేసిక్ స్క్రిప్ట్ డిస్కషన్స్ కంప్లీట్ చేశారట. కరోనా వల్ల మిగతా పనులకు బ్రేక్ వచ్చింది. ఇండస్ట్రీలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు సినిమాను ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారు.