'మెగా ఫ్యాక్టర్' ఈసారైనా కమర్షియల్గా వర్కవుట్ అవుతుందా?
on May 26, 2020
వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న దర్శకుడు క్రిష్. 12 ఏళ్ళ తన దర్శక ప్రస్థానంలో ఒకదానితో ఒకటి పొంతన లేని సినిమాలే తెరకెక్కించాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
'గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణంవందే జగద్గురుమ్’, ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్ బయోపిక్’.. ఇలా తెలుగులో క్రిష్ రూపొందించిన చిత్రాలన్నీ డిఫరెంట్ జానర్ మూవీస్నే. ఇదిలా ఉంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా మెగా కాంపౌండ్ హీరోలతో ఐదేళ్ళకో సినిమా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు క్రిష్.
మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన 'వేదం'(2010)లో మెగా కాంపౌండ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కథానాయకుడిగా నటిస్తే.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిన వార్ డ్రామా 'కంచె'(2015)లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. కట్ చేస్తే.. మళ్లీ అయిదేళ్ళ తర్వాత మరో మెగా కాంపౌండ్ హీరోతో సినిమా చేస్తున్నాడు క్రిష్.
ఆ హీరో మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొఘలాయిల కాలం నాటి కథా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ మూవీ.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకుంది. లాక్ డౌన్ అనంతరం చిత్రీకరణని పునఃప్రారంభించనున్నారు.
కాగా, మెగా కాంపౌండ్లో క్రిష్ రూపొందించిన గత రెండు చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ విన్నర్స్గా మాత్రం నిలవలేకపోయాయి.
ఈ నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మూవీతోనైనా క్రిష్ మెగా కాంపౌండ్ తరఫున కమర్షియల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ మూవీని ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. స్వరవాణి ఎం.ఎం.కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.