కొరటాల సందేశం: కరోనా వస్తే దాచకండి.. బాధ్యతగా ప్రవర్తించండి!
on Jul 15, 2020
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆచార్య' షూటింగ్ ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందో తెలీదు. ఈ టైమ్లో ఖాళీగా ఉండటమెందుకని ఒక పేరుపొందిన నిర్మాణ సంస్థకు స్క్రిప్ట్ కన్సల్టెంట్గా ఉండేందుకు కొరటాల అంగీకరించాడంట. మహేశ్తో చేసిన 'భరత్ అనే నేను' అనే మూవీ తర్వాత రెండేళ్ల నుంచీ అతను 'ఆచార్య' కోసమే పనిచేస్తున్నాడు. 'శ్రీమంతుడు' నుంచి తన సినిమాలతో ఏదో ఒక సామాజిక సందేశం ఇస్తూ వస్తోన్న అతను ఇప్పడు నిజ జీవితంలోనూ అలాంటి సందేశాలే ఇస్తున్నాడు. తాజాగా అతను కరోనా వైరస్పై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ సందేశం ఇచ్చాడు.
"వైరస్ కంటే, కొంతమంది ఆ వైరస్ సోకిన వ్యక్తులు దాన్ని రహస్యంగా దాస్తుండటం మరింత భయపెడుతోందనేది నిజం. వైరస్ ఇన్ఫెక్షన్కు గురైన అందరికీ నేను చేసే విన్నపం ఏమంటే, బాధ్యతగా వ్యవహరించడం. మన సన్నిహితులకు ఆ విషయాన్ని తెలియజేయండి. తమతో సన్నిహితంగా మెలగిన వాళ్లకు తెలియజేస్తే, వాళ్లు కూడా టెస్ట్ చేయించుకుంటారు. Need of the hour. మరింత నాగరికంగా ఉండాల్సిన సమయం" అంటూ అతను ట్వీట్ చేశాడు.
దానికి ఒకతను ఇదే తరహాలో స్టూడెంట్స్ గురించి కూడా స్పందించమని కామెంట్ చేశాడు. "ఇంత డేంజరస్గా పరిస్థితి ఉంటే.. ఎగ్జామ్స్ పెట్టి స్టూడెంట్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు.. 4 నెలల నుంచి సెల్ప్ క్వారంటైన్లోనే ఫ్యామిలీ మొత్తం ఉన్నాం.. జాబ్ లేదు, పని లేదు. మీరు రెస్పాండ్ అవ్వండి కొరటాల సర్" అని అతను ట్వీట్ పెట్టాడు.