రానాతో మైథలాజికల్ డ్రామా... వచ్చే ఏడాది మొదలు!
on Oct 14, 2020
'రుద్రమదేవి' విడుదలై అక్టోబర్ 9కి ఐదేళ్లు. ఐదేళ్ళలో 'రుద్రమదేవి' దర్శకుడు గుణశేఖర్ మరో సినిమా చేయలేకపోయారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రానాతో మైథలాజికల్ డ్రామా 'హిరణ్యకశ్యప' చేయాలని స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల మీద కూర్చున్నారు. ఇన్నాళ్లు కష్టపడిన స్క్రిప్ట్ తో కాకుండా కొత్తగా 'శాకుంతలం' సినిమా ప్రకటించారు. దాంతో 'హిరణ్యకశ్యప' ఆగిందని ప్రచారం జరిగింది. సదరు ప్రచారం మీద గుణశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రానాతో 'హిరణ్యకశ్యప' ఆగిందని ఎవరు చెప్పారు? అది ఆగలేదు. రద్దు కాలేదు. పక్కన పెట్టలేదు. కరోనా ప్రభావం తగ్గిన తరవాత వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభిస్తాం. వర్చువల్ రియాలిటీ సెట్స్ కూడా రెడీ చేస్తున్నాం. నేను ప్రీ-విజువలైజేషన్ వర్క్ పూర్తి చేశా. 'శాకుంతలం' సినిమా కొన్ని పాత్రలు, లొకేషన్లతో కంప్లీట్ చేయవచ్చు. 'హిరణ్యకశ్యప'లో యుద్ధ సన్నివేశాలకు ఆర్టిస్టులు ఎక్కువమంది కావాలి. అందుకని ముందు 'శాకుంతలం' చేయాలని అనుకున్నా" అని గుణశేఖర్ తెలిపారు.
అన్నట్టు... ఈ ఐదేళ్లలో అనుష్క 'భాగమతి', 'నిశ్శబ్దం' వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. 'బాహుబలి 2'తోనూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మధ్యలో 'సైరా', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి', 'ఓం నమో వెంకటేశాయ' సినిమాల్లో అతిథి, ప్రత్యేక పాత్రల్లో కనిపించింది. హీరోయిన్లు ఒక సెట్ నుండి మరో సెట్ కి వెళ్ళవచ్చు. దర్శకులు స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి టైమ్ పడుతుంది కదా! అందుకని, రెండు సినిమాల మధ్య వాళ్లకు ఎక్కువ గ్యాప్ వస్తుంది.
Also Read