'క్రాక్' రిలీజ్ ఆపమని కోర్టు స్టే రావడంతో నిద్రపట్టలేదు!
on Jan 20, 2021
సంక్రాంతికి నిజమైన సంబరాలు చేసుకుందెవరంటే 'క్రాక్' మూవీ యూనిట్ అని చెప్పక తప్పదు. జనవరి 9 రాత్రి సెకండ్ షోతో విడుదలైన 'క్రాక్' సంక్రాంతి విన్నర్గా నిలవడమే కాకుండా, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆనందానికైతే హద్దులు లేవు. మెగాస్టార్ చిరంజీవి 'క్రాక్' మూవీని చూసి, గోపీచంద్ను తన ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు. సినిమా చాలా బాగుందని, తన ఒంగోలు రోజులు గుర్తుకు వచ్చాయనీ చెప్పారు.
అయితే ఈ సినిమాకి ముందు గోపీచంద్కు 'ఒంగోలు గిత్త', 'విన్నర్' సినిమాల రూపంలో రెండు ఫ్లాప్స్ వచ్చాయి. 2013లో వచ్చిన రవితేజ సినిమా 'బలుపు' అతడి లాస్ట్ హిట్. మళ్లీ ఇప్పుడు రవితేజతోటే అతడికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లభించింది. 2010లో రవితేజ సినిమా 'డాన్ శీను'తోటే అతను డైరెక్టర్గా తన కెరీర్ను ఆరంభించాడు. ఈ పదకొండేళ్ల కాలంలో అతను ఆరు సినిమాలు డైరెక్ట్ చేస్తే, వాటిలో మూడు రవితేజతోటే కావడం గమనార్హం.
కాగా జనవరి 9న మూడు షోలు రద్దు కావడం, ఆ ముందు రోజు సినిమాని ఆపమంటూ కోర్టు నుంచి స్టే రావడంతో అతను పడ్డ వేదన వర్ణనాతీతం. ఆ విషయమే తెలియజేస్తూ, "మా సినిమా విడుదలకు ముందు రోజు కోర్టు నుంచి స్టే రావడంతో రాత్రంతా నిద్రపట్టలేదు. మూడు షోలు రద్దు కావడంతో బాధపడ్డాను. ఇలాంటి ఇబ్బందులు ఏ దర్శకుడికి రాకూడదు" అన్నాడు గోపీచంద్. నిజానికి 'క్రాక్'ను ఓటీటీలో రిలీజ్ చెయ్యమని ఒత్తిళ్లు వచ్చాయి. "కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా అని బలంగా నమ్మి, థియేటర్స్లో రిలీజ్ కోసమే పట్టుదలగా ఎదురు చూశాను. సంక్రాంతికి విడుదలైన మా సినిమా పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది." అని అతను తెలిపాడు.
అంతేగాక ఆ సమయంలో నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీలతో పాటు ఇండస్ట్రీ తమకు అండగా నిలిచిందన్నాడు. హీరోలు మంచు మనోజ్, సాయితేజ్ సహా పలువురు ఫోన్ చేసి ధైర్యాన్నిచ్చారు అని అతను వెల్లడించాడు. ఇలా ఎన్నో అవాంతరాలు దాటుకుని ‘క్రాక్’ సినిమా విజయం సాధించడంతో తమ బాధలన్నీ మరచిపోయామని ఆనందం వ్యక్తం చేశాడు గోపీచంద్.