సుక్కు కోసమే దేవిశ్రీ...
on Oct 27, 2018
మరో మెగా మేనల్లుడు తెరంగేట్ర్రం చేయడానికి రంగం సిద్ధమైంది. మెగా కుటుంబం నుంచి ఇప్పటి వరకూ అరడజను మందికి పైగా యువ కథానాయకులు వచ్చారు. త్వరలో సాయిధరమ్ తేజ్ తమ్ముడు, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రానున్నాడు. సుకుమార్ దగ్గర రచన, దర్శకత్వ శాఖల్లో పని చేసిన సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాతో వైష్ణవ్ తేజ్ కూడా కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ చిన్న సినిమాలకు సంగీతం అందించడం మానేశాడు. అగ్ర కథానాయకుల చిత్రాలకు, అగ్ర నిర్మాణ సంస్థలు నిర్మించే చిత్రాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అగ్ర నిర్మాణ సంస్థే... వైష్ణవ్ తేజ్ మెగా మేనల్లుడే అయినప్పటికీ... సుకుమార్ కోసమే దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించడానికి అంగీకరించాడని సమాచారం.
వైష్ణవ్ తేజ్ సినిమాకు సుకుమార్ అన్నీ తానై వ్యవహరిస్తారని తెలుస్తుంది. కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని సమాచారం. గతంలో సుకుమార్ కథ అందించిన 'కుమారి 21ఎఫ్'కి దేవిశ్రీ సంగీతం అందించాడు. దానికి సుకుమార్ శిష్యుడు ప్రతాప్ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్ సినిమా దర్శకుడు కూడా సుకుమార్ శిష్యుడే. దీనికీ దేవిశ్రీ సంగీత దర్శకుడు. సుకుమార్ ప్రతి సినిమాలో సంగీత దర్శకుడిగా దేవిశ్రీ పేరు వుంటుంది. సుకుమార్ శిష్యుల సినిమాల్లో కూడా ఆయన పేరే వుంటుందేమో!