అప్పుడు `వెంకీ`.. ఇప్పుడు `రంగ్ దే`..
on Feb 26, 2021
..
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి మార్చి నెలతో ప్రత్యేక అనుబంధమే ఉంది. ఈ నెలలోనే తన సంగీత సారథ్యంలో రూపొందిన తొలి చిత్రం `దేవి` (1999) విడుదలైంది. అంతేకాదు.. `వెంకీ`(2004), `లెజెండ్` (2014), `రంగస్థలం` (2018) వంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఇదే మార్చి నెలలో విడుదలై దేవిశ్రీ ప్రసాద్ స్థాయిని మరింత పెంచాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు మార్చి నెలలో మరో సినిమా రాబోతోంది. అదే.. `రంగ్ దే`. యువ కథానాయకుడు నితిన్, `మహానటి` ఫేమ్ కీర్తి సురేశ్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మార్చి 26న రిలీజ్ కాబోతోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. డీఎస్పీ కెరీర్ బెస్ట్ మాస్ హిట్స్ లో ఒకటైన `వెంకీ` కూడా 17 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే మార్చి 26న థియేటర్లలో సందడి చేసింది. కట్ చేస్తే.. అదే తేదికి రొమాంటిక్ ఎంటర్ టైనర్ `రంగ్ దే` కూడా విడుదల కానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరి.. `వెంకీ` రిలీజ్ డేట్ సెంటిమెంట్ ని `రంగ్ దే` కూడా రిపీట్ చేసి.. దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలో మరో మెమరబుల్ హిట్ ని చేరుస్తుందేమో చూడాలి.