దానం అనేది రౌడీ మామూలు కాదు.. ఫైర్ అయిన డైరెక్టర్!
on Mar 31, 2020
దానం అనేది సామాజిక ఒత్తిడితో ఇచ్చే రౌడీ మామూలు కాదని 'ప్రస్థానం' డైరెక్టర్ దేవా కట్టా ఫైర్ అయ్యారు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలకు తమ వంతు చేయూత నివ్వడానికి పలువురు సినీ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు నిలిచిపోవడంతో దినసరి వేతనంతో బతికే పేద కళాకారులు, కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వాళ్లను ఆదుకోవడానికి చిరంజీవి చైర్మన్గా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరుతో ఒక ఫండ్ ఏర్పాటైంది. దీనికి కూడా అనేక మంది సెలబ్రిటీలు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. ఎవరెంత ఇస్తున్నారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. కొంతమంది తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తాము ఇస్తున్న విరాళాలను తెలియజేస్తున్నారు.
దీంతో ఎవరి పేర్లయితే మీడియాలో రాలేదో, లేదా బహిరంగంగా ప్రకటించలేదో వాళ్లను టార్గెట్ చేసుకొని నెటిజన్లు నెగటివ్గా ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ఒకవైపు పవన్ కల్యాణ్, మరోవైపు చిరంజీవి ఎవరెవరు దేనికి విరాళాలు ఇచ్చారో ప్రస్తావిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా లిస్టులు ఇస్తూ వస్తున్నారు. దాంతో ఆ లిస్టులో కనిపించని వాళ్లను టార్గెట్ చేస్తూ నెటిజన్లు నెగటివ్గా ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. మొదట్లో అక్కినేని, దగ్గుబాటి, అల్లు ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ మూడు ఫ్యామిలీలు కూడా విరాళాలు ప్రకటించాయి. దాంతో సామాజిక ఒత్తిడితోనే వాళ్లు విరాళాలు ప్రకటించారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమైంది.
ఇప్పడు దీనిపైనే డైరెక్టర్ దేవా కట్టా స్పందించాడు. ట్రోలర్స్ను టార్గెట్ చేసుకొని ట్విట్టర్లో చెలరేగాడు. "కోవిడ్-19 కానీ, ఇతర సమస్యలపై కానీ చెప్పకోదగ్గ స్థాయిలో దాతృత్వం ప్రదర్శించిన సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సహృదయులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. కానీ వాళ్లు దాన్ని ప్రచారం చేసుకోవాలని అనుకోలేదు. దాన్ని వారు వ్యక్తిగత లేదా ఆధ్యాత్మిక చర్యగా చూస్తారు. తమ దానాల్ని ప్రకటించుకొనేవాళ్లకూ పాయింట్ ఉంది. అది.. ఇతరుల్ని మోటివేట్ చేసి, వాళ్లను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేలా చేస్తుందని. నిశ్శబ్దంగా తమ విరాళాల్ని అందించేవారిపై పిచ్చి ప్రేలాపనలు చేయడం వికృతమైన పని. వాళ్ల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. దాతృత్వం అనేది సామాజిక ఒత్తిడితో ఇచ్చే రౌడీ మామూలు కాదు" అని గట్టిగా రాసుకొచ్చాడు.