వెండితెర భారతం
on Aug 15, 2017
29 రాష్ట్రాలు.. 24 అధికారిక భాషలు... వందలాది జాతులు... వేలాది కులాలు.. విభిన్న మతాలు... కోట్లాది ప్రజలు... వెరసి భారత్. ప్రపంచంలో... ఇలా చెప్పుకునే దేశం ఒక్కటి కూడా ఉండదు తెలుసా? ఒక దేశంలో కేవలం రెండు భాషలుంటేనే.. బయట కొట్టుకు చస్తున్నారు. కానీ మన ఇండియాలో... ఇన్ని జాతులున్నా... ఇన్ని భాషలున్నా... ఇన్ని వ్యతాసాలున్నా... మనం మాత్రం కలిసే ఉంటాం. దానికి కారణం... మట్టిని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం ఇక్కడ అలవాటు. వేరే దేశాల్లో ఎవరికోసం వాళ్లు బతుకుతారు. కానీ మన దేశంలో... ‘నా’ అనుకున్నవారికోసం బతుకుతారు. అందుకే... మన దేశం ప్రపంచానికే పూజగది.
ఈ దేశం వసుదైక కుటుంబంగా కీర్తించబడానికి కారణం... ఈ మట్టి, ఈ నేల కాదు... ఈ మనుషులు. కులమత వ్యత్యాసాలు ఇక్కడ ఎన్నయినా ఉండొచ్చు... దేశం విషయంలో మాత్రం అందరిదీ ఒకే మాట... ఒకే బాట. పరాయి పాలనలలో వందల ఏళ్లు మగ్గినా... ఇక్కడ అస్తిత్వాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అప్పుడు రగిలిన స్పూర్తి ఇప్పటికీ రగులుతూనే ఉంది.
భారతీయ కళలు... దేశ ఔన్నత్యానికి ప్రతీకలు... భావోద్వేగ ఉత్పేరికాలు. ఆనాటి స్వతంత్ర్యం సమరానికి ఆయుధాలు. మనిషిలో నిద్రాణమైన ఉన్న దేశభక్తిని తట్టి లేపడానికి పూర్వీకులు చేసిన ప్రయోగాలు, ప్రయత్నాలు భావితరాలకు పవిత్ర పాఠ్యాంశాలని చెప్పక తప్పదు. నాటకం, నాటిక, ఒగ్గు కథ, బుర్ర కథ, తోలుబొమ్మలాట... వీటితోనే ఎంతోమందిలో దేశభక్తిని నూరిపోశారు మన పెద్దలు. 1913లో భారతదేశంలోకి అడుగుపెట్టిన ఓ వినూత్న సాంకేతిక విప్లవం.. ‘సినిమా’.
స్వాతంత్ర్య సమరంలో సినిమా కూడా అప్పట్లో ప్రధాన పాత్రే పోషించింది. తొలినాళ్లలో దేశభక్తి చిత్రాలను నిర్మించిన పెద్దలందరూ జైళ్లపాలయ్యారు. ‘మహాత్మాగాంధీ’పేరుతో 1941లో ఓ తెలుగు సినిమా వచ్చి... బ్రిటీష్ వారి ఆగ్రహానికి బలైంది. కానీ... ఆ సినిమాను దొంగచాటుగా కూడా చాలా చోట్ల ప్రదర్శించారు. ఇక స్వాతంత్ర్యం సమరం నేపథ్యంలో వచ్చిన పూర్తిస్థాయి తెలుగు సినిమా ‘మనదేశం’(1949). అప్పటికే స్వంతంత్ర్యం వచ్చేసింది కాబట్టే... మన వాళ్లు ఆ సాహసం చేయగలిగారు. మహానటుడు ఎన్టీయార్ తెరకు పరిచయమైన చిత్రం కూడా ఇదే. సినిమా స్వర్ణయుగ కాలంలో... కుటుంబ కథాచిత్రాల్లో కూడా ఎక్కడో ఒకచోట దేశభక్తికి సంబంధించిన పాటను కానీ.. సన్నివేశాన్ని కానీ చొప్పించేవారు.
అయితే... కొన్నాళ్లపాటు దేశభక్తి సినిమాలకంటే... సామాజ అభ్యున్నతికోరే సినిమాలే ఎక్కువగా వచ్చాయి. దాంట్లోనే దేశభక్తిని మిళితం చేసేవారు. రోజులుమారాయ్(1955), ముందడుగు(1958), పదండి ముందుకు(1962), కథానాయకుడు(1969), ‘మరోప్రపంచం’(1970)రైతుబిడ్డ(1971), డబ్బుకు లోకం దాసోహం(1973), దేశోద్ధారకులు(1973). ‘గాంధీ పుట్టిన దేశం’(1973).. ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే.
అయితే... దేశభక్తి సినిమాలకు గౌరవాన్ని తెచ్చింది మాత్రం కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమానే. దీనికి పదేళ్లకు ముందే ఎన్టీయార్ ‘బొబ్బిలియుద్ధం’(1964) చిత్రం దేశభక్తి ప్రధానంగా సాగే సినిమానే అయినా.. ‘అల్లూరి సీతారామరాజు’ సాధించిన విజయం నిజంగా అసామాన్యం. దేశభక్తి సినిమాలకు స్వర్ణయుగం అంటే 80వ దశకమే అని చెప్పాలి. ‘సర్థార్ పాపారాయుడు’(1980), ‘బొబ్బిలిపులి’(1982), ‘ఈనాడు’(1982), ‘నాదేశం’(1982), ‘ఆంధ్రకేసరి’(1983), ‘నేటిభారతం’(1983), ‘వందేమాతరం’(1985) ఇలా చాలా సినిమాలు 80ల్లో తెలుగు తెరను అలరించాయ్.
1993లో 11ఏళ్ల విరామం తర్వాత ఎన్టీయార్ చేసిన సాంఘిక చిత్రం‘మేజర్ చంద్రకాంత్’కూడా దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమానే కావడం గమనార్హం. ఆ సినిమాలో ఆ మహానటుని నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు తేలిగ్గా మరచిపోగలరా?
కృష్ణవంశీ ‘ఖడ్గం’, ‘మహాత్మ’ చిత్రాల్లో కూడా దేశభక్తి మెండుగానే ఉంటుంది.
ఆ విధంగా వెండితెర... కేవలం వినోదాన్నే కాక, కావల్సినంత దేశభక్తిని కూడా ప్రేక్షక హృదయాల్లో నింపుతూనే వచ్చింది. నిజం చెప్పాలంటే... ఈ విషయంలో సమాజం పట్ల సినిమా నిర్వహించిన పాత్ర నిజంగా ప్రశంసనీయమే. నేటికి మన స్వతంత్ర్య భారతానికి 70 ఏళ్లు నిండాయ్. ఈ సందర్భంగా భారతీయులందరికీ వెండితెర సాక్షిగా వందనాలు అందిస్తోంది ‘తెలుగువన్’.
-నరసింహ బుర్రా