'అల.. వైకుంఠపురములో' కూడా ఫ్రీమేకేనా?
on Dec 3, 2019
మాటల మాంత్రికుడిగా పేరు ప్రఖ్యాతులు పొంది, డైలాగ్ రైటర్స్కు టాలీవుడ్లో ఒక స్టార్ హోదా తెచ్చిన త్రివిక్రం.. కాలక్రమంలో స్టార్ డైరెక్టర్గానూ రూపాంతరం చెందడం మనకు తెలుసు. అయితే దర్శకుడయ్యాక ఆయన ఒరిజినాలిటీని నమ్ముకోకుండా ఇతర సినిమాల నుంచి ఐడియాలను, కథలను తస్కరిస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటూ వస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. బయట ఏ వేదికమీద మాట్లాడినా ఒక మేధావిగా కనిపించే ఆయన తను డైరెక్ట్ చేసే సినిమాల విషయానికొచ్చేసరికి గతంలో వచ్చిన సినిమాల నుంచి 'సంగ్రహించిన' అంశాల్ని వాడుకుంటూ ఉంటాడనే నెగటివ్ ప్రచారం పొందడం ఆశ్చర్యం కలిగించకుండా ఉంటుందా!
లేటెస్టుగా తను రూపొందిస్తోన్న 'అల.. వైకుంఠపురములో' సినిమాకి సంబంధించి కూడా త్రివిక్రం ఆ తరహా ఆరోపణలనే ఎదుర్కొంటూ వస్తున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీగా ఆయన రూపొందిస్తోన్న ఆ మూవీ ఎన్నడో ఆరు దశాబ్దాల క్రితం నాటి ఎన్టీ రామారావు సినిమా 'ఇంటిగుట్టు'కు ఫ్రీమేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ జోడీగా మహానటి సావిత్రి నటించగా 1958లో వచ్చిన ఆ సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకుడు. వెంపటి సదాశివబ్రహ్మం కథ, మాటలు సమకూర్చిన ఆ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని బాగా అలరించి 100 డేస్ ఆడింది. అందులో ఒక దొంగను పట్టుకోడానికి మారువేషంలో ఒక ఇంట్లోకి అడుగుపెట్టి ఆ ఇంటి అమ్మాయి ప్రేమలో పడిన పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎన్టీఆర్ నటించారు. పైగా కథలో ఆయన పుట్టుక విషయంలోనూ ఒక రహస్యం ఉంటుంది. 'ఇంటిగుట్టు' కథను మక్కీకి మక్కీ కాపీ కొట్టకుండా, ఎన్టీఆర్ క్యారెక్టర్ తరహాలోనే 'అల.. వైకుంఠపురములో' మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ను త్రివిక్రం తీర్చిదిద్దాడంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో బన్నీ కూడా అదే తరహాలో తన ఐడెంటిటీని దాచిపెట్టి, మరో వ్యక్తిగా హీరోయిన్ ఇంటికి వెళ్తాడనీ, హీరోయిన్తో పాటు ఆ ఇంట్లో వాళ్ల మనసుల్ని గెలుచుకొంటాడనీ వినిపిస్తోంది. ఇలా అసలు ఐడెంటిటీని దాచి వేరే వ్యక్తిగా ఒక ఇంట్లోకి వెళ్లడం అనేది గతంలో చాలా సినిమాల్లోనే.. ఆ మాటకొస్తే 'అతడు' నుంచి 'అత్తారింటికి దారేది' దాకా త్రివిక్రం సినిమాల్లోనే కనిపించినా, ఈ సినిమాలో 'ఇంటిగుట్టు' తరహా క్యారెక్టరైజేషన్, సన్నివేశాలు ఎక్కువగా మ్యాచ్ అవుతాయని చెప్పుకుంటున్నారు. అదేమిటో కానీ త్రివిక్రం ఏ సినిమా చేస్తున్నా.. అది ఏ పాత మూవీకి లేదా ఏ ఫారిన్ మూవీకి కాపీ అంటూ ఆరాలు తీయడం ఎక్కువైపోయింది. తన మునుపటి మూవీస్తో త్రివిక్రం అలాంటి ఇంప్రెషన్ కలిగించాడు మరి. 'అరవింద సమేత.. వీరరాఘవ' సినిమాకు తన నుంచి ఇన్పుట్స్ తీసుకొని, తన కథలోంచి 'మొండికత్తి' అనే మాటను సినిమా అంతా యథేచ్ఛగా వాడుకొని, కనీసం క్రెడిట్స్లో తన పేరు వేయలేదనీ, తనతో మూడు రోజుల పాటు కథా చర్చలు జరిపి ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదనీ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రాయలసీమ రచయిత వేంపల్లి గంగాధర్ ఆరోపించడం మనకు తెలుసు.
అంతకు ముందు పవన్ కల్యాణ్తో రూపొందించిన 'అజ్ఞాతవాసి', 'అత్తారింటికి దారేది' సినిమాలను ఫ్రెంచ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'లార్గో వించ్' ఆధారంగా రూపొందించాడంటూ త్రివిక్రంపై విమర్శలు రావడం చూశాం. నితిన్, సమంత జంటగా తీసిన 'అ.. ఆ' సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల 'మీనా' ఆధారంగా తీసిన విషయం ఆ సినిమా విడుదలై, ప్రేక్షకులు గుర్తించేదాకా బయటపెట్టకపోవడం మనం చూశాం. క్రెడిట్స్లో కనీసం సులోచనారాణి పేరు వేయకపోవడం ఏ రకంగా నైతికమంటూ ఆయనపై విమర్శకులు మాటల దాడి చేశారు కూడా. అలాగే 'అతడు' సినిమాని హాలీవుడ్ బ్లాక్బస్టర్ 'అసాసిన్స్' ఆధారంగా రూపొందించాడనే విమర్శల్నీ త్రివిక్రం ఎదుర్కొన్నారు.
ఇప్పుడు మరోసారి 'అల.. వైకుంఠపురములో' సినిమాపై అదే తరహా కాపీ ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంతుందో, సినిమా మన ముందుకు వస్తేగానీ తెలీదు. ఇవాళ ఏ క్రేజీ ఫిల్మ్ రిలీజైనా అది ఏ సినిమాకైనా కాపీనా అంటూ శల్యపరీక్ష చేయడం, ఏమాత్రం పోలికలు కనిపించినా కాపీ అంటూ విమర్శలు చేయడం కనిపిస్తోంది. ఒక పోస్టర్ రిలీజైతేనే కాపీ విమర్శలు వస్తున్నప్పుడు, సినిమాపై రాకుండా ఉంటాయా? చూద్దాం.. 'అల.. వైకుంఠపురములో' మూవీపై జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజముందో!