బాలయ్య చెప్పిన 'పంది' డైలాగ్పై చర్చ.. రచ్చ!
on Apr 14, 2021
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రానికి ఉగాది పండగ రోజు 'అఖండ' అనే టైటిల్ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ చేసిన టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న రిలీజ్ చేసిన ఆ టీజర్ ఇప్పటికీ నంబర్ 1గా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండటం విశేషం. బాలయ్య సినిమా టీజర్కు ఈ రేంజ్ రెస్పాన్స్ యూట్యూబ్లో రావడం ఇటీవలి కాలంలో ఇదే. ఇప్పటికే 11 మిలియన్లకు పైగా అది వ్యూస్ సాధించింది.
నిజానికి ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ పెట్టనున్నారంటూ రెండు రోజుల క్రితం దాకా కూడా బాగా ప్రచారం జరిగింది. బాలకృష్ణ ఈ మూవీలో ద్విపాత్రలు పోషిస్తున్నారనీ, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ రోల్ కాగా, మరొకటి అఘోరా రోల్ అనీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పడు అఘోరా వేషంలో కాకుండా అఖండ వేషంలో బాలయ్య దర్శనమిచ్చారు.
బాలయ్య సినిమా అంటేనే డైలాగ్స్ పేలుతుంటాయి. ఇక బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ కాంబినేషన్ సినిమా అంటే ఇక డైలాగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకు తెలిసిందే. లేటెస్ట్ టీజర్లో బాలయ్య చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. అది టీడీపీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అయ్యి, టీడీపీ నాయకుల మీద విమర్శలు చేస్తూ, బూతు పంచాంగం విప్పుతున్న ఓ నాయకుడిని ఉద్దేశించి చెప్పిందే అంటూ చెప్పుకుంటున్నారు.
టీజర్లో "హరహర మహాదేవ శంభోశంకర" అంటూ అఖండ రూపంతో తెరపై ప్రత్యక్షమైన బాలయ్య, "కాలుదువ్వే నంది ముందు రంగుమార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది." అంటూ చేతిలోని త్రిశూలాన్ని నేలకేసి బలంగా కొట్టి, తనపైకి వచ్చిన దుండగుల్ని దునుమాడి, "ఆ.." అని నోరుతెరచి భీకరంగా గర్జించడం ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉంది.
ఈ డైలాగ్కు అర్థమేంటి? అని ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ కూడా చర్చించుకుంటున్నారు. పంది రంగుమార్చడం ఏమిటి? అని ప్రశ్నించుకొని, ఇది టీడీపీలోంచి వేరే పార్టీలోకి మారిన నాయకుడి గురించి చెప్పిన డైలాగ్ అని తీర్మానిస్తున్నారు. "కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది" అనే డైలాగ్ ఆ నాయకుడికి హెచ్చరిక అని అనుకుంటున్నారు. అయితే ఇది సినిమాలో సందర్భానుసారం వచ్చే డైలాగ్ తప్ప, ఆ డైలాగ్కూ, పాలిటిక్స్కూ ఏ సంబంధం లేదని అంటున్నవాళ్లూ ఉన్నారు. మొత్తానికి ఈ చర్చ.. రచ్చరచ్చగా నడుస్తోంది.
Also Read