తీవ్ర జ్వరంతో హాస్పిటల్లో చేరిన కమెడియన్ పృథ్వీ
on Aug 4, 2020
సీనియర్ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. పది రోజుల నుంచీ జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం కొవిడ్-19 టెస్ట్ చేయించుకోగా నెగటివ్ వచ్చింది. అయితే సోమవారం జ్వరం తీవ్రమవడంతో వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఈ విషయాన్ని ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు హాస్పిటల్లోనే క్వారంటైన్లో ఉన్నాననీ, వేంకటేశ్వరస్వామి దయ తనమీద ఉండాలని కోరుకుంటున్నాననీ దీనవదనంతో పృథ్వీ చెప్పారు. ఆ వీడియోలో ఆయనను చూస్తుంటే అనారోగ్యంతో బాగా ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది.
వైసీపీలో చురుగ్గా వ్యవహరిస్తూ, 2019 ఎన్నికలలో ఆ పార్టీ తరపున ప్రచారం చేసిన పృథ్వీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎస్వీబీసీ చైర్మన్ పదవి అప్పగించారు. అయితే ఒక ఉద్యోగితో ఆయన చేసిన అభ్యంతరకర సంభాషణ తాలూకు ఆడియో టేక్ లీక్ కావడంతో అనూహ్య పరిణామాల నేపథ్యంలో దానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.