బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు!
on Sep 30, 2020
సినీ ప్రియులకు శుభవార్త. ఎప్పుడెప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా, తమ అభిమాన హీరోల సినిమాలను బిగ్ స్క్రీన్పై చూస్తూ, చిందులు వేద్దామా అని ఎదురుచూస్తోన్న అభిమానులకు సంబరం చేకూరుస్తూ అక్టోబర్ 15 నుంచి దేశంలో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను వెలువరించింది. అక్టోబర్ 15 నుంచి సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపుకోవడానికి అనుమతినిచ్చింది.
డోర్లు మూసివేసి ఉంచే హాళ్లలో 50 శాతం కెపాసిటీతో నడుపుకోవచ్చని చెబుతూనే, 200 మందికి మించి ప్రేక్షకులు ఉండరాదని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రేక్షకులందరూ తప్పనిసరిగా ఫేస్ మాస్క్లు ధరించాలి, సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలి. థర్మల్ స్కానింగ్ తర్వాతే ప్రేక్షకులను థియేటర్ల లోపలకు అనుమతించాలి. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో థియేటర్ల యజమానులే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అశ్రద్ధ వహించరాదనీ, కరోనా మహమ్మారి దరి చేరకుండా అన్ని రకాల జాగ్రత్తలూ పాటించాలనీ ప్రేక్షకులను కోరుతున్నారు.
ఇప్పటికే షూటింగ్లకు నిబంధనలతో అనుమతులిచ్చిన కేంద్రం ఇప్పుడు థియేటర్లకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ క్రమంగా గాడిలో పడుతుందనీ, కార్మికులకు తిరిగి ఉపాధి లభిస్తుందనీ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read