సైరా... చలో చైనా!
on Mar 22, 2019
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోంది. భీమవరం, గాజువాక స్థానాల్లో ఎమ్మెల్యేగా పవన్, నరసాపురం ఎంపీగా మెగా సోదరుడు నాగబాబు పోటీ చేస్తున్నారు. దాంతో మెగాభిమానులు రాజకీయ ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి, మెగాస్టార్ సంగతేంటి? ప్రత్యక్ష రాజకీయాలకు కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటోన్న చిరంజీవి, ఎన్నికల ప్రచార సమయంలో ఇండియాలో ఉండరని తెలుస్తోంది. చైనా వెళుతున్నారట. 'సైరా నరసింహారెడ్డి' షూటింగు కోసం. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో ముఖ్యమైన పోరాట ఘట్టాలను చైనాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. త్వరలో 'సైరా' చిత్రబృందం చైనా వెళుతుంది. పోలింగ్ సమయానికి తిరిగి వస్తారో? రారో? సైరా గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్, హీరోయిన్లుగా నయనతార, తమన్నా, కీలక పాత్రల్లో జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇటీవల 'ఆర్ ఆర్ ఆర్' ప్రెస్మీట్లో రామ్ చరణ్ కూడా 2019 సెకండాఫ్ లో సినిమాను విడుదల చేస్తామని తెలిపాడు.