కరోనా ఎఫెక్ట్ః టాలీవుడ్ నష్టం వందల కోట్లలో...
on Apr 9, 2020
కరోనా కాటుకు ప్రతి వ్యాపారం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. ప్రపంచంలో పలు దేశాల్లో పలు వ్యాపారాలు కుదేలవుతున్నాయి. అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా నష్టపోతోంది. కరోనా వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏర్పడే నష్టం ఎంతనేది ప్రస్తుతానికి అంచనా వేయలేకపోయినప్పటికీ వందల కోట్లలో ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. థియేటర్ డోర్లు మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియనప్పటికీ, సినిమా పరిశ్రమ కోలుకుంటుందనీ, ఒక్కసారి సాధారణ పరిస్థితులు నెలకొంటే బౌన్స్ బ్యాక్ అవుతుందనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలని పరిశ్రమలో పెద్దలు అందరూ కలిసి కూర్చుని డిస్కస్ చేస్తామని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా ఫైనాన్సియర్లతో మాట్లాడతామని అన్నారు. వడ్డీ రేట్లు తగ్గించి నిర్మాతలకు సహాయపడవలసిందిగా ఫైనాన్సియర్లను రిక్వెస్ట్ చేస్తామని చిరంజీవి అన్నారు. ఒక విధంగా ముందే వాళ్లను రిక్వెస్ట్ చేశారు. కరోనా నుండి బయటపడడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.