ప్లాస్మా దానం చేసిన నాగబాబుకు 'చిరు' ప్రశంస!
on Oct 15, 2020
కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన మెగా బ్రదర్ నాగబాబు దాని నుంచి బయటపడ్డారు. సాధారణంగా ఎవరైనా కరోనా వస్తే భయపడతారు, కనీసం బాధపడతారు. కానీ ఆయన మాత్రం తనకు కరోనా వైరస్ సోకిందని సంతోషపడ్డారు. కారణం.. తను ప్లాస్మా డొనేట్ చేసి, కొంతమందినైనా దాని నుంచి బయటపడేయగలనని. ఆ విషయం ఆయనే చెప్పారు. కొవిడ్-19 నెగటివ్ అని తేలాక ఆయన బుధవారం ప్లాస్మా దానం చేశారు. మూడు నెలల పాటు యాంటీ బాడీస్ శరీరంలో పెరుగుతుంటాయి కాబట్టి, ఆరు సార్లు తాను ప్లాస్మాను డొనేట్ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆల్రెడీ ఒకసారి డొనేట్ చేశాను కాబట్టి ఎంత లేదన్నా ఇంకో నాలుగు సార్లు ప్లాస్మా దానం చేస్తానని నాగబాబు అన్నారు.
కాగా తమ్ముడు ప్లాస్మా దానం చేయడంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా సంతోషించారు. ఈ సందర్భంగా తమ్ముడిని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభినందించారు. గురువారం నాగబాబు ప్లాస్మా దానం చేస్తున్న పిక్చర్ను షేర్ చేసిన ఆయన, "covid 19 తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, CCTలో plasma donate చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు. ఈ సందర్భంగా covid నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు plasma donate చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి. #DonatePlasma" అని ట్వీట్ చేశారు.