30 ఏళ్ల తర్వాత కలుసుకున్న 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్!
on Jan 24, 2021
చిరంజీవి టైటిల్ రోల్ చేసిన 'గ్యాంగ్ లీడర్' మూవీ ఇండస్ట్రీ హిట్. విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో చిరంజీవి అన్నయ్యలుగా మురళీ మోహన్, శరత్కుమార్ నటించారు. 'గ్యాంగ్ లీడర్' వచ్చింది 1991లో మే నెలలో. అంటే దాదాపు 30 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆ సినిమా కానీ, బప్పీలహిరి మ్యూజిక్ ఇచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ కానీ ప్రేక్షకుల మనసుల్లోంచి ఏమాత్రం చెరిగిపోలేదు.
కాగా ఆ సినిమా అన్నదమ్ములు ముగ్గురూ 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అవును. మురళీ మోహన్, శరత్ కుమార్, చిరంజీవి ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో కలుసుకున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఇద్దరు అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉన్నారు. చిరంజీవి, మురళీ మోహన్ హైదరాబాద్లో అనేక సందర్భాల్లో కలుసుకున్నారు. కలిసి సినిమాలు చేశారు. చిరంజీవి, శరత్ కుమార్ సైతం అప్పుడప్పడు కలుసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ ముగ్గరూ కలుసుకున్నది మాత్రం మళ్లీ ఇప్పుడే.
చిరంజీవి 'ఆచార్య' మూవీ షూటింగ్లో, శరత్ కుమార్ 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్లో, మురళీ మోహన్ ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఆ మూడు సినిమాలు షూటింగ్లు రామోజీ ఫిల్మ్సిటీలోనే జరుగుతున్నాయి. దాంతో మురళీ మోహన్, శరత్ కుమార్ 'ఆచార్య' సెట్స్ మీదకు వెళ్లి చిరును కలుసుకున్నారు. ఆ ఇద్దరినీ చిరు సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా 30 ఏళ్ల క్రితం తాము నటించిన 'గ్యాంగ్ లీడర్' మూవీకి సంబంధించిన తమ అనుభవాలను ఆ ముగ్గురూ ఓసారి గుర్తు చేసుకున్నారు, అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు. తాము మళ్లీ కలుసుకున్న దానికి గుర్తుగా ఫొటోలు కూడా దిగారు. గత కాలపు జ్ఞాపకాలెప్పుడూ మధురంగానే ఉంటాయి కదా!