మెగా మేనల్లుడు చేపల వేట!
on Feb 4, 2019
ఇప్పుడు ఇండస్ట్రీలో మెగా మేనల్లుళ్లు నలుగురు ఉన్నారు. అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఆల్రెడీ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో నాలుగో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా రానున్నాడు. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై జనవరిలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ తేజ్ జాలరిగా కనిపించనున్నాడు. సముద్రంలో చేపలు పట్టే కాకినాడ కుర్రాడు పాత్రలో వైష్ణవ తేజ్ నటిస్తున్నాడని తెలిసింది.
సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన పోస్టర్... సముద్రం ముందు, పడవ పక్కన నిలబడిన వైష్ణవ తేజ్ కనిపిస్తాడు. అతడి పాత్రను ప్రతిబింబించే విధంగా ఆ పోస్టర్ డిజైన్ చేశారన్న మాట. రంగస్థలం తరహాలో ఈ చిత్రం కూడా పల్లె వాతావరణానికి అద్దం పట్టేలా తెరకెక్కిస్తున్నారట. కాకినాడలో సుకుమార్ కొన్ని రోజులు లెక్చరర్ గా పనిచేశారు. అప్పట్లో ఆయన చూసిన ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్ర కథ రాశారట.