వంద రోజుల్లో పూర్తి చేయాలన్న చిరంజీవి.. షూటింగ్ మొదలెట్టరేమి?
on Oct 15, 2020
'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి స్టేజీ మీదే 'ఆచార్య' డైరెక్టర్ కొరటాల శివకు అల్టిమేటమ్ లాంటిది ఇచ్చారు.. ఏమని? తమ సినిమాను వంద రోజుల్లో పూర్తి చెయ్యాలని. షూటింగ్కు ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల సినిమా కాస్ట్ అనవసరంగా పెరిగిపోతోందనీ, దీన్ని నివారించాలంటే ప్లానింగ్తో వంద రోజుల్లోపల షూటింగ్ను పూర్తి చెయ్యాలనీ ఆయన దర్శక నిర్మాతలకు పిలుపునిచ్చారు. అదే చిరంజీవి ఎప్పడు 'ఆచార్య' సెట్స్ మీదకు అడుగుపెడతారా అని ఆ సినిమా యూనిట్ వేయికళ్లతో ఎదురుచూస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా ఏడు నెలలుగా మిగతా అనేక సినిమాల షూటింగ్ల తరహాలోనే 'ఆచార్య' షూటింగ్ ఆగిపోయింది. సెప్టెంబర్ నుంచి ఒక్కొక్క సినిమా షూటింగ్ రెజ్యూమ్ అవుతూ వస్తోంది. అయితే మెగాస్టార్ మాత్రం షూటింగ్కు వచ్చే విషయంలో హీరోయిజం ప్రదర్శించలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల ఇంటెన్సిటీ తగ్గినట్లు నాలుగైదు రోజులుగా వెల్లడవుతున్న కేసుల సంఖ్య తెలియజేస్తోంది.
అయితే ఇటీవల కొన్ని సినిమా షూటింగ్లు ప్రారంభించినప్పుడు యూనిట్ సభ్యుల్లో కొంతమందికి పాజిటివ్ అని తేలుతుండటంతో తిరిగి వాటిని ఆపివేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పైగా తన వయసురీత్యా కూడా చిరంజీవి షూటింగ్కు మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయన వయసు 65 ఏళ్లు. అరవై ఏళ్లు పైబడిన వాళ్లు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తుండటంతో ఆయన తన ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు.
నిజానికి 'ఆచార్య' షూటింగ్ను ఈ అక్టోబర్లో పునఃప్రారంభించాలని డైరెక్టర్ కొరటాల శివతో పాటు నిర్మాతలు రామ్చరణ్, నిరంజన్రెడ్డి భావించారు. కానీ మరో నెల ఆగుదామని చిరంజీవి సూచించడంతో నవంబర్కు షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది. ఇప్పుడు నవంబర్లోనూ షూటింగ్ మొదలయ్యే విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయని ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. వంద రోజుల్లో సినిమాని పూర్తి చెయ్యాలని అందరికీ పిలుపునిచ్చిన మెగాస్టార్ ఇప్పుడు తనే సెట్స్ మీదకు రావడానికి వెనకడుగు వేస్తున్నారని అనుకుంటున్నారు.