ట్విట్టర్ అకౌంట్తో సోషల్ మీడియాలో మెగాస్టార్!
on Mar 25, 2020
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా కె చిరు ట్వీట్స్ పేరుతో ట్విట్టర్ అకౌంట్ను బుధవారం ప్రారంభించారు. ఉదయం 11:10 గంటలకు చేసిన తొలి పోస్ట్లో ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తోటి భారతీయులతో, తెలుగు ప్రజలతో, అభిమానులతో ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందామని పిలుపునిచ్చారు.
రెండో ట్వీట్లో 21 రోజులు మనందర్నీ ఇళ్లల్లోనే ఉండమని భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ఒక అనివార్యమైన చర్య అని పేర్కొన్నారు. మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన ఆదేశాలను పాటిద్దామని చెప్పారు. ఇంటిపట్టునే సురక్షితంగా ఉందామన్నారు. తెలుగు, ఇంగ్లీష్.. రెండు భాషల్లో ఈ ట్వీట్లు చేశారు.
చిరంజీవి ట్వీట్లకు మంచి స్పందన వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే వాటికి వేలాది లైక్స్, రిట్వీట్లు వచ్చాయి. ఆయనకు వేల సంఖ్యలో ఫాలోవర్స్ తయారయ్యారు.