ఒకే బాటలో చిరు, ప్రభాస్
on Apr 21, 2021
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే బాటలో వెళుతున్నారా? అవుననే చెప్పక తప్పదు వారి చేతిలో ఉన్న సినిమాలను చూస్తే.
కాస్త వివరాల్లోకి వెళితే.. అటు చిరు, ఇటు ప్రభాస్ ఇద్దరి చేతిలోనూ నాలుగేసి సినిమాలు ఉన్నాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇద్దరు కూడా ఇదివరకు పనిచేయని దర్శకులతోనే పనిచేస్తూ ఒకే బాటలో ముందుకు సాగుతున్నారు.
ముందుగా చిరు విషయానికొస్తే.. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న `ఆచార్య`ని కొరటాల శివ తెరకెక్కిస్తుండగా.. త్వరలో పట్టాలెక్కనున్న `లూసీఫర్` రీమేక్ ని మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. ఆపై `వేదాళమ్` రీమేక్ ని మెహర్ రమేశ్ తెరకెక్కించనున్నారు. అలాగే.. బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నలుగురితోనూ మెగాస్టార్ పనిచేయడం ఇదే తొలిసారి.
ఇక ప్రభాస్ సంగతే తీసుకుంటే.. చిత్రీకరణ తుదిదశలో ఉన్న `రాధేశ్యామ్`ని `జిల్` రాధాకృష్ణ రూపొందిస్తుండగా.. `సలార్`ని `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. `ఆదిపురుష్`ని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఆపై నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పేరు నిర్ణయించని సైన్స్ ఫిక్షన్ చేయనున్నారు. ఈ నలుగురితోనూ ప్రభాస్ కి ఇవే మొదటి చిత్రాలు.
మొత్తమ్మీద.. అటు చిరు, ఇటు ప్రభాస్ ఇద్దరి నుంచి రానున్న తదుపరి నాలుగు సినిమాలు కూడా ఇప్పటివరకు కలిసి పనిచేయని దర్శకుల కాంబినేషన్ వే కావడం ఆసక్తిదాయకం.