ఆ ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్లో ఒకే ఒక్క సినిమా 'లంకేశ్వరుడు'!
on May 13, 2021
ఒకరు అత్యధిక చిత్రాల దర్శకుడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన దర్శకరత్న దాసరి నారాయణరావు, మరొకరు 150 సినిమాలు పూర్తిచేసుకున్న మెగాస్టార్ చిరంజీవి. అతి తక్కువ కాలంలో యాభై, వంద చిత్రాలను పూర్తి చేసిన దాసరి ఎందరో నటులను తెరకు పరిచయం చేశారు. దాదాపు అగ్ర నటులందరూ ఆయన దర్శకత్వంలో నటించారు. మరోవైపు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన చిరంజీవి పరిశ్రమలోకి అడుగుపెట్టి, అందరూ అగ్ర దర్శకులతోనూ పనిచేశారు. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, విజయ బాపినీడు లాంటి దర్శకులతో పలు చిత్రాలు చేసిన చిరంజీవి.. దాసరితో ఒకే ఒక్క చిత్రంలో పనిచేయడం చిత్రాతి చిత్రమైన విషయం. అది దాసరికి వందో చిత్రం కావడం ఇంకో విశేషం.. ఆ సినిమా 'లంకేశ్వరుడు'!
చిరంజీవి నటించగా విడుదలైన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'. అది 1978లో వచ్చింది. ఆ తర్వాత పదకొండేళ్లకు కానీ ఆయన దాసరి దర్శకత్వంలో నటించలేదు. 'లంకేశ్వరుడు' 1989 అక్టోబర్ 27న విడుదలైంది.
ఈ సినిమాకి ముందు దాసరి-చిరంజీవి కాంబినేషన్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఇరువురి అభిమానులూ తెగ ఎదురుచూస్తూ వచ్చారు. అప్పటికే దాసరి ఆనాటి అగ్ర హీరోలందరితోనూ బ్లాక్బస్టర్స్ తీసి ఉండటంతో ఆ కాంబినేషన్పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఆ కాంబినేషన్తో ఏకైక చిత్రాన్ని నిర్మించిన ఘనతను వడ్డే రమేశ్ దక్కించుకున్నారు.
డబ్బున్నవాళ్లను దోచుకొని లేనివాళ్లకు పంచిపెట్టే శివశంకర్ (చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అనేది గమనార్హం)గా చిరంజీవి నటించగా, ఆయన సరసన నాయిక పాత్రను రాధ పోషించింది. సత్యనారాయణ, మోహన్బాబు, రఘువరన్ విలన్ పాత్రల్లో కనిపిస్తే, చిరంజీవి చెల్లెలిగా రేవతి, ఆమె భర్తగా కల్యాణ చక్రవర్తి నటించారు.
విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ అవడం ఈ సినిమాకు మైనస్గా మారిందని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఎక్స్పెక్టేషన్స్ను ఈ సినిమా అందుకోలేకపోయింది. ఓపెనింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా తర్వాత రోజుల్లో ఆ రేంజ్లో వసూళ్లను సాధించలేదు. ఏదేమైనా 'లంకేశ్వరుడు' సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేయడం జరగలేదు.
Also Read