'ఆచార్య' కోసం మహేశ్ను సంప్రదించలేదు!
on Apr 5, 2020
మెగాస్టార్ చిరంజీవి చాలా తెలివిగా రాజమౌళి-కొరటాల కోర్టులో బాల్ వేసేశారు. ఇప్పుడు ప్రేక్షకుల చూపులన్నీ అగ్ర దర్శకులు ఇద్దరిపై ఉన్నాయి. వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది? అని పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొనడం ఖాయం.
అసలు వివరాల్లోకి వెళితే... సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి జనరంజకమైన సినిమాలు తీసే కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఇందులో కీలక పాత్రలో మహేష్ బాబు నటిస్తారని కొన్ని రోజులు, తర్వాత రామ్ చరణ్ నటిస్తారని మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఇప్పటివరకూ ఈ విషయమై సినిమా యూనిట్ లో ఎవరూ పెదవి విప్పలేదు. తాజా ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఏం జరిగినదీ వివరంగా చెప్పారు. మహేష్ బాబు పేరు మీడియాలో ఎలా వచ్చిందో తమకు తెలియదని, అతడిని ఆ పాత్రకు అనుకోలేదని చిరంజీవి చెప్పారు.
"మహేష్కి నాపై అభిమానం, ప్రేమ. తనంటే నాకు చాలా ఇష్టం. నా బిడ్డలాంటివాడు. తనతో సినిమా చేసే అవకాశం వస్తే అద్భుతం. 'ఆచార్య'లో ఒక పాత్రకు ముందునుంచీ రామ్ చరణ్ అయితే బావుంటుందని కొరటాల శివ భావన. 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ ఇవ్వగలడా? లేదా? అని ఒక మీమాంస కూడా ఉంది. రాజమౌళి, కొరటాల మధ్య అండర్ స్టాండింగ్ కి వస్తే... చరణ్ చేస్తాడు. మా తండ్రీకొడుకులు కలిసి కంప్లీట్ సినిమా చేస్తే చూడాలనేది సురేఖ కోరిక" అని చిరంజీవి అన్నారు. ఒకవేళ చరణ్ నటిస్తే అది అతిథి, ప్రత్యేక పాత్రలా కాకుండా మంచి నిడివి గల పాత్ర అని ఆయన అన్నారు. ఏం జరుగుతుందో? వెయిట్ అండ్ సీ!