చార్మి పేరెంట్స్కు కరోనా పాజిటివ్!
on Oct 26, 2020
నటి, నిర్మాత చార్మీ కౌర్ అమ్మానాన్నలు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు చార్మి. ఇటీవలి హైదరాబాద్ వరదల వల్ల తలెత్తిన అపరిశుభ్రతే దీనికి కారణమని పేర్కొంటూ, ఈ మహమ్మారి కాలంలో తగినవిధంగా జాగ్రత్తలు తీసుకొమ్మని అభిమానులను ఆమె కోరారు. ఈ నెల 22న తన పేరెంట్స్కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని ఆమె చెప్పారు.
ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘమైన నోట్ రాసిన చార్మి, "ఈ అనుభవం తర్వాత నేనిచ్చే ఏకైక సలహా ఏమంటే, మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా, దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రారంభ దశలోనే దాన్ని కనిపెడితే తీవ్రమైన నష్టం తలెత్తకుండా అది మిమ్మల్ని కాపాడుతుంది. మీ ఆరోగ్యానికి అది ఓ వరం అవుతుంది. మా అమ్మానాన్నలను ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం చూడాలని ఎదురుచూస్తున్నా" అని తెలిపారు.
"కరోనా వైరస్పై పోరాటంలో మా అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకుంటున్న ఏఐజీ హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికీ, ఆయన బృందానికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను" అని ఆమె తెలిపారు. చాలా కాలంగా తనకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలుసనీ, మరో ఆలోచన లేకుండా గుడ్డిగా ఆయనను నమ్మి, ఆయన హాస్పిటల్స్లోనే తన పేరెంట్స్ను చేర్పించాననీ చార్మి పేర్కొన్నారు.
పని విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న తెలుగు-హిందీ భాషా చిత్రం 'ఫైటర్'ను బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్తో కలిసి నిర్మిస్తున్నారు చార్మి . ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానున్నది.
Also Read