కుంటాల జలపాతంకు వెళ్లిన అల్లు అర్జున్పై కేసు రిజిస్టరైంది!
on Sep 17, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అతని 'పుష్ప' మూవీ టీమ్పై కేసు నమోదయ్యింది. కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారనేది వారిపై ఆరోపణ. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం మూసివేసిన కుంటాల జలపాతాన్ని కొవిడ్-19 రూల్స్కు వ్యతిరేకంగా సందర్శించిన అల్లు అర్జున్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు సాధనా స్రవంతి (ఎస్హెచ్ఎస్ఎస్) ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్లోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యంలో అల్లు అర్జున్, 'పుష్ప' బృందం షూటింగ్ జరిపారని కూడా సాధనా స్రవంతి ప్రతినిధులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన నేరడిగొండ పోలీసులు, ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కుంటాల జలపాతం సహా యాత్రా స్థలాలను మూసివేసింది. అందువల్ల ప్రజలకు వాటిని సందర్శించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కూ, అతని బృందానికి ఎలా కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి అనుమతి ఇచ్చారంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్పై ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.
హైదరాబాద్ టైమ్స్తో మాట్లాడిన ఆదిలాబాద్ డీఎఫ్ఓ డాక్టర్ బి. ప్రభాకర్, "తన విజిట్ విషయమై అల్లు అర్జున్ మాకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. అన్ని టూరిస్ట్ ప్లేస్ల వద్ద వాటిని మూసివేసినట్లు మేం సైన్-బోర్డులు పెట్టాం. అయినప్పటికీ, పలువురు నిబంధనలు ఉల్లంఘించి వాటిని సందర్శిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ మొదటి వ్యక్తి కాదు. కానీ సెలబ్రిటీ అయిన ఆయన మరింత బాధ్యతగా వ్యవహరించాలి" అని చెప్పారు.
Also Read