ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసి, కెరీర్ బెస్ట్ సాధించాలనే పట్టుదలతో బన్నీ!
on Nov 22, 2020
సినిమా సినిమాకీ ఇమేజ్ పెంచుకుంటూ 'జులాయి' సినిమాతో రూ. 40 కోట్ల క్లబ్బులో చేరిన అల్లు అర్జున్ 'రేసుగుర్రం'తో రూ. 50 కోట్ల క్లబ్బులోనూ, 'సరైనోడు'తో రూ. 70 కోట్ల క్లబ్బులోనూ చేరాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు కానీ బన్నీ నుంచి మరో బ్లాక్బస్టర్ రాలేదు. ఈసారి అలాంటి ఇలాంటి హిట్ కాదు.. ఏకంగా నాన్-బాహుబలి రికార్డ్ను సొంతం చేసుకున్న హిట్ వచ్చింది. ఆ సినిమా 2020 సంక్రాంతి బరిలో నిలిచిన 'అల.. వైకుంఠపురములో' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా!
ఈ సినిమాలో బంటు పాత్రలో చలాకీగా సునాయాసంగా నటించి, యాక్షన్ సన్నివేశాల్లో, డాన్సుల్లో ఎప్పట్లా తన ఫ్యాన్స్ను అమితంగా అలరించాడు, ఆకట్టుకున్నాడు అర్జున్. ఏ తెలుగు హీరోకూ లేనివిధంగా మలయాళం ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు పొందిన అర్జున్కు ఈ సినిమా మలయాళ డబ్బింగ్ వెర్షన్ 'అంగు వైకుంఠపురత్తు' కూడా ఆనందాన్ని తెచ్చి పెట్టింది. నెట్ఫ్లిక్స్లోనూ ఆ సినిమాకి మంచి ఆదరణ దక్కింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ చేస్తున్నాడు. దీనికి సుకుమార్ దర్శకుడు. ఆ ఇద్దరి కాంబినేషన్లో 'పుష్ప' మూడో చిత్రం. మునుపు వచ్చిన 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల్లో మొదటిది బ్లాక్బస్టర్ హిట్టయి, బన్నీని స్టార్గా మార్చేసింది. అది.. బన్నీ కెరీర్లో హీరోగా రెండో సినిమా మాత్రమే. 'ఆర్య 2' రిలీజయ్యే నాటికి తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడుస్తుండటం వల్ల బంద్ల కారణంగా థియేటర్లు తరచూ మూతపడాల్సి రావడంతో నష్టపోయింది కానీ, అది కూడా హిట్ వెంచర్ అవ్వాల్సింది. ఆంధ్ర, రాయలసీమ ఏరియాల్లో దానికి లాభాలు వచ్చాయి.
ఇప్పుడు ఈ థర్డ్ వెంచర్తో మరో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాలని ఆ ఇద్దరూ తపిస్తున్నారు. అయితే ఇంతదాకా బన్నీ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాక, ఆ వెంటనే చేసిన సినిమాలేవీ ఆ రేంజికి రాలేదు. 'జులాయి' తర్వాత 'ఇద్దరమ్మాయిలతో', 'రేసుగుర్రం' తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు' తర్వాత 'దువ్వాడ జగన్నాథమ్' లాంటి సినిమాలు రావడం గమనించదగ్గ అంశం. ఇప్పుడు ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసి, 'అల.. వైకుంఠపురములో' మూవీని మించి 'పుష్ప'తో బన్నీ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కొడతాడా? కొడతాడని ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
- YM