మెగాస్టార్ను కలిసిన సోము వీర్రాజు
on Aug 7, 2020
మెగాస్టార్ చిరంజీవిని ఇటీవలే బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు హైదరాబాద్లోని ఆయన నివాసంలో గురువారం కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఎంపికవడంతో మర్యాదపూర్వకంగానే తాను చిరంజీవిని కలుసుకున్నానని వీర్రాజు తెలిపారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన చిరంజీవిని వీర్రాజు వంటి బీజేపీ సీనియర్ నేత కలవడం ఇటు పొలిటికల్, అటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కొంతకాలం క్రితం మెగాస్టార్ను తమ పార్టీలో చేర్పించుకోడానికి భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలు చేసిందనే ప్రచారం జరిగింది. ఆయన తమ పార్టీలో చేరితో ప్రచారకర్తగా బాగా ఉపయోగపడతారనీ, ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం కావడంలో అది దోహదం చేస్తుందనీ ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. సందర్భవశాత్తూ బీజేపీ ఇప్పటికే చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో చేతులు కలపడం గమనార్హం. ఇప్పుడు చిరంజీవిని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఆయన ఇంటికి వెళ్లి కలుసుకోవడం చర్చలకు తావిచ్చింది.