ఓటీటీ సినిమాలు తియ్యనని తేల్చేసిన బండ్ల గణేశ్!
on Jul 10, 2020
కరోనా కష్ట కాలంలో థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడిపోయి సినిమా వ్యాపారం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. చిన్న, మధ్య స్థాయి బడ్జెట్తో తయారైన సినిమాలను ఒక్కొక్కటిగా ఓటీటీలకు నేరుగా అమ్మేస్తున్నారు నిర్మాతలు. ఇటీవలి కాలంలో అమృతా రామమ్, పెంగ్విన్, కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ వంటి సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్పై విడుదలయ్యాయి. మరికొన్ని అదే బాటలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాతగా మారిన నటుడు బండ్ల గణేశ్ తన అభిప్రాయం వెల్లడించాడు. కొవిడ్-19 బారినపడి కోలుకున్న ఆయన తాను ఓటీటీలు, ఏటీటీల్లో సినిమాలు తియ్యనని ఖరాఖండిగా చెప్పేశాడు. "నేను తీస్తే థియేటర్లలో ఆడే సినిమాలు తీస్తాను. లేకపోతే నా వ్యాపారాలు చేసుకుంటా. థియేటర్లలో రిలీజయ్యే రోజే సినిమా తీస్తా. ఈ ఓటీటీలు, ఏటీటీల కోసం నేను సినిమాలు తియ్యలేను. రెవెన్యూ కోసం వాటి జోలికి పోను. రెవెన్యూ జనరేట్ చేయడానికి నాకు చాలా వనరులున్నాయి. నాకు సినిమా అంటే కిక్కు. సినిమానే నా జీవితం. సినిమా నుంచే నేనొచ్చాను. నా పదిహేనో సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చాను. నాకిప్పుడు 46 సంవత్సరాలు. 31 సంవత్సరాలు అయ్యింది. నాకైతే ఓటీటీలు, ఏటీటీల మీద ఇంట్రెస్ట్ లేదు" అని తేల్చి చెప్పాడు గణేశ్.