ఐసీయూ నుంచి బయటపడ్డ బండ్ల గణేశ్!
on Apr 15, 2021
కమెడియన్, ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఆరోగ్య స్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆయన రెండోసారి కొవిడ్-19 బారిన పడి, రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో అపోలో హాస్పిటల్లో చేరారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించిన డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్య స్థితి మెరుగయ్యిందనీ, చాలావరకు కోలుకున్నారనీ తెలిసింది.
దాంతో ఆయనను ఐసీయూ నుంచి మామూలు రూమ్కు తరలించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం 'వకీల్ సాబ్' ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న బండ్ల గణేశ్ అక్కడ ఎంతో ఉత్సాహంతో, ఉత్తేజంగా కనిపించారు. తను ఆరాధ్య దైవంగా భావించే పవన్ కల్యాణ్పై మరోసారి తన భక్తిని ప్రదర్శిస్తూ ప్రసంగించారు. అయితే ఆ ఈవెంట్లో పాల్గొన్నప్పుడే ఆయనకు కరోనావైరస్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్లోనూ గణేశ్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యి చికిత్స తీసుకుని, నాలుగైదు రోజుల్లోనే కోలుకున్నారు. ఆ భగవంతుడి దయవల్ల తనకు నెగటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. తొలిసారి వచ్చినప్పటితో పోలిస్తే, రెండోసారి వచ్చినప్పుడు మాత్రం ఆయన తీవ్ర నిస్సత్తువకు గురయ్యారు.