ఛీఛీ.. నాగబాబు గురించి నేనెందుకు మాట్లాడాలి?
on Jun 1, 2020
మెగా బ్రదర్ నాగబాబు గురించి స్పందించడానికి నందమూరి బాలకృష్ణ ఇష్టపడలేదు. తాను ఎందుకు మాట్లాడాలని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరకు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు. అంతకుముందు చిరంజీవి ఇంట్లో సినిమా ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో థియేటర్ల మూసివేత చిత్రీకరణకు అనుమతి వంటి పలు అంశాలను చర్చించారు. ఆ చర్చలకు తనను పిలవలేదని బాలకృష్ణ తెలిపిన సంగతి తెలిసిందే. అందరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాతగా తాను చాలా బాధపడ్డాననీ... తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ వద్ద నాగబాబు గురించి ప్రస్తావించగా "నేనేమీ మాట్లాడలేదు. అతనే మాట్లాడుతున్నాడు. నేనెందుకు మాట్లాడాలి. ఛీఛీ" అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరకు చిరంజీవి, నాగార్జున వెళ్ళిన సమయంలో మిమ్మల్ని ఆహ్వానించలేదనీ... గతంలో కేసీఆర్ మీద మీరు విమర్శలు చేయడమే కారణమా? అందువల్ల దూరం పెట్టారని అనుకోవచ్చా? అని బాలకృష్ణను ప్రశ్నించగా "కేసీఆర్ గారికి నాపై ఎప్పుడూ కోపం లేదు. రాజకీయాలు వేరు. ఎందుకు పిలవలేదో నాకు తెలియదు మరి" అని సమాధానం ఇచ్చారు.