మా ఆవేశం నుంచి పుడుతున్న సినిమా ఇది: బాలకృష్ణ
on Dec 6, 2019
'సింహా', 'లెజెండ్' లాంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం నిర్మాణ పనులు శుక్రవారం (డిసెంబర్ 6) ఘనంగా ప్రారంభమయ్యాయి. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫస్ట్ షాట్లోనే "నువ్వొక మాటంటే అది శబ్దం, అదే మాట నేనంటే అది శాసనం" అనే పవర్ఫుల్ డైలాగ్ను తనదైన స్టైల్లో చెప్పారు బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ "ఈరోజు శుభదినం. ఎప్పడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న,బోయపాటి శ్రీనుతో కలిసి నేను చేస్తున్న నూతన చిత్రం ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను కాంబినేషన్లో నేను 'సింహా', 'లెజెండ్' సినిమాలు చేయడం, అవి అద్భుతమైన విజయాలు అందుకోవడం మీకు తెలుసు. మా కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే నాది, బోయపాటిది ఏం సిద్ధాంతం అంటే.. గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ మా నెక్స్ట్ మూవీ మీదనే ఉంచుతాం. అలాగే ఎం. రత్నంగారి కథ, సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఏదైతే జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. అంత బాధ్యత తీసుకుంటాం కనుకనే 'సింహా', 'లెజెండ్' సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. అలాగే ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వచ్చింది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను" అని చెప్పారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ "ద్వారక క్రియేషన్స్లో నా రెండవ సినిమా ఇది. బాలయ్యబాబు, నాది హ్యాట్రిక్ ఫిలిం. ఇండస్ట్రీలో నా మొదటి సినిమా 'భద్ర'. ఒక మంచి సినిమాతో నా లైఫ్ స్టార్ట్ అయింది. 'సింహా' వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. 'సింహా', 'లెజెండ్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ఆ రెండు సినిమాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను" అన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి మాట్లాడుతూ "భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తియ్యవచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆ గౌరవాన్ని సినిమా విడుదల తర్వాత బాలకృష్ణగారి అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుండి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమాను నిర్మిస్తానని ప్రామిస్ చేస్తున్నాను" అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: తమన్ ఎస్., సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, నిర్మాత: మిర్యాల రవీందర్రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.
ఆ భగవంతుడే పోలీసుల రూపంలో శిక్ష విధించాడు
దిశ ఉదతంతంలో నిందితులైన నలుగురిని శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై బాలకృష్ణ స్పంధించారు. "దిశ అనే మహిళపైన కొంత మంది దుండగులు చేసిన సామూహిక అత్యాచారానికి ఫలితంగా ఈ రోజు వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాల ద్వారా సంఘాన్ని మార్చడానికి, వారికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నాన్నగారు నందమూరి తారక రామారావుగారు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అలాగే 'లెజెండ్' సినిమాలో మేము కూడా 'స్త్రీ లేకుంటే సృష్టి లేదు' అనే మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు దేశం యావత్తు మన మహిళలపై ఎన్నో ఘాతకాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు నిందితులకు సరైన శిక్ష విధించాడు. మరోసారి ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యలు చేయకుండా ఉండటానికి, అసలు ఆ ఆలోచన కూడా మొలకెత్తనీయకుండా వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందరికీ ఇదొక గుణపాఠం కావాలి. ముందు ముందు ఇటువంటి ఘాతుకానికి సాహసించకుండా, ఆ ఆలోచన కూడా రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి నా అభినందనలు తెలియజేస్తున్నా. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఇదే అంశపై బోయపాటి మాట్లాడుతూ "దిశకి జరిగిన అన్యాయం గురించి దేశంలోని అందరూ బాధపడుతున్నపుడు తెలిసిన మంచి విషయం ఏంటంటే వారు పారిపోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోవాలి.. పొల్యూషన్ నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ పోలీస్ నుండి ఎవరూ తప్పించుకోలేరు” అన్నారు బోయపాటి శ్రీను.